
- రాష్ట్రంలోని 4 ఐటీడీఏల పరిధిలో తొలి దశలో 22 వేల ఇండ్లు
- వీటిని నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్న ఆఫీసర్లు
- గైడ్లైన్స్ ప్రకారం అధిక జనాభా ప్రాంతాల్లో అర్హుల గుర్తింపు
- హర్షం వ్యక్తం చేస్తోన్న ఆదివాసీ, గిరిజన గూడేల్లోని ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి/ ఏటూరునాగారం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చుతోంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఆదివాసీ, గిరిజనులకు వరంగా మారింది. రాష్ట్రంలోని 4 ఐటీడీఏల పరిధిలో రాష్ట్ర రిజర్వు కోటా(ఎస్ఆర్క్యూ) కింద ప్రత్యేకంగా తొలి దశలో 22,016 ఇండ్లను మంజూరు చేస్తూ ఇటీవల సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అధికంగా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 12,836, భద్రాచలం ఐటీడీఏలో 5,024, మన్ననూరు పరిధిలో 2,156, ఏటూరు నాగారంలో 2 వేల ఇండ్ల చొప్పున కేటాయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై ఆదివాసీ, గిరిజన గూడేల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా కేటాయింపు
ఇందిరమ్మ ఇండ్లను ఐటీడీఏ పరిధిలోని నియోజకవర్గాల వారీగా కేటాయించి లబ్ధిదారులను అధికారులు గుర్తిస్తారు. ఆయా ప్రాంతాల్లో తొలి విడతలో పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం ఐటీడీఏకు మంజూరైన 2 వేల ఇండ్లలో ఆదివాసీ, గిరిజనులు అత్యధికంగా ఉండి పూర్తిస్థాయిలో పక్కా ఇల్లు లేని వెనకబడిన ములుగు సెగ్మెంట్ కు ప్రాధాన్యతనిస్తూ అధికారులు తొలి దశలో 1,500 కేటాయించారు.
నర్సంపేట సెగ్మెంట్ కు 250, మహబూబాబాద్సెగ్మెంట్ కు 250 చొప్పున కేటాయించా రు. నర్సంపేట సెగ్మెంట్ లోనూ అర్హులైన వారిని ఎంపిక చేసి ఇండ్లను కేటాయిస్తారు. రెండో దశలో ఆదివాసీ, గిరిజనుల జనాభాను బట్టి ఇతర సెగ్మెంట్లలోనూ ఐటీడీఏల ద్వారా ఇండ్లను పంపిణీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా 3 ఐటీడీఏల పరిధిలో కూడా ఇలాగే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
పీసా గ్రామసభల్లో ఎంపిక చేపట్టాలి
ఐటీడీల పరిధిలో ప్రత్యేకంగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను పీసా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేపట్టాలి. ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో పీసా కమిటీలు ఉన్నాయి. ఆయా కమిటీల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేస్తే అర్హులకు న్యాయం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వం, ఐటీడీఏ ఆఫీసర్లపై నమ్మకం పెరుగుతోంది. - పాయం కోటి, తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షుడు
ఏండ్లుగా గుడిసెలోనే..
ఏండ్లుగా గుడిసేలోనే ఉంటున్నాం. సొంతింటిని కట్టుకోవాలనే కల ఉండేది. కానీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇల్లు నిర్మించుకోలేకపోతున్నం. రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి నిరుపేద ఆదివాసీ, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. నాకు సొంతింటి కల తీరనుంది. - దుగిని సమ్మయ్య, అల్లంవారి ఘనపురం, ఏటూరునాగారం మండలం
సర్కార్ గైడ్ లైన్స్ ప్రకారం లబ్ధిదారుల ఎంపిక
ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో ప్రభుత్వం 2 వేల ఇండ్లను కేటాయించింది. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా తొలి విడతలో వీటిని పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తాం. - చిత్రా మిశ్రా, ఐటీడీఏ పీవో, ఏటూరునాగారం.