ప్రభుత్వ సంస్థలకే సర్కారు ఆర్డర్లు.. అంగన్వాడీలకు విజయ పాలు, దేవాలయాలకు విజయ నెయ్యి

ప్రభుత్వ సంస్థలకే సర్కారు ఆర్డర్లు.. అంగన్వాడీలకు విజయ పాలు, దేవాలయాలకు విజయ నెయ్యి
  • విద్యా శాఖ, గురుకుల సొసైటీలు, అంగన్​వాడీ సెంటర్లకు జైళ్ల శాఖ నుంచి  బెంచీలు
  • ఎన్ఐసీకి  భూభారతి పోర్టల్ అప్పగింత
  • స్కూళ్ల రిపేర్లు, అద్దె బస్సులు, సోలార్​ పవర్​ ప్లాంట్లు మహిళా సంఘాలకు
  • సర్కార్​ నిర్ణయంతో ఆయా సంస్థలకు మేలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ టెండర్లు, ఆర్డర్లలో ప్రభుత్వ సంస్థలకే రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తోంది. దీంతోపాటు మహిళా సంఘాలకూ పలు బాధ్యతలను అప్పగిస్తోంది. దీంతో ప్రభుత్వ సంస్థలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతోందని, ఆయా సంస్థలపై జనాల్లో నమ్మకం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ లాంటి సంస్థలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం వల్ల అవి లాభాల్లోకి రావడమేగాక  ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగించాలని, సర్కారు ఆర్డర్లలో  ప్రభుత్వ సంస్థలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, సెకండ్​ ప్రయారిటీ కింద మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అన్ని శాఖలు ఇదే బాటలో పయనిస్తున్నాయి.

భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 2020లో  తెచ్చిన ధరణి పోర్టల్​ను  ‘టెర్రాసిస్’ ​అనే ప్రైవేట్  విదేశీ కంపెనీకి గత బీఆర్ఎస్  ప్రభుత్వం అప్పగించింది. ఈ పోర్టల్​ వల్ల రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆన్​లైన్​లో రైతుల పేర్లు, సర్వే నంబర్లు తప్పుగా రావడం, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పాత యజమానుల పేర్లతో పట్టాలు, కొన్నిచోట్ల పట్టా భూములు ప్రభుత్వ, అసైన్డ్​ భూములుగా నమోదు కావడం, పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరడం లాంటి అనేక సమస్యలు తలెత్తాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం అప్లికేషన్లు పెట్టుకున్న రైతుల నుంచి రూ.400 కోట్లు వసూలు చేశారు తప్ప తప్పులు సరిదిద్దలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే  నేషనల్​ ఇనఫర్మేటిక్​ సెంటర్​ (ఎన్ఐసీ) కు ధరణి పోర్టల్​ను అప్పగించడమేగాక  భూభారతిగా పేరు మార్చి అమలు చేస్తోంది. 

విజయ డెయిరీతో కల్తీకి చెక్

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అంగన్​వాడీ కేంద్రాలకు పాలు, దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసే బాధ్యతను విజయ డెయిరీకి అప్పగించింది. దీంతో అప్పటి దాకా ప్రైవేటు​సంస్థల నుంచి సరఫరా అయ్యే కల్తీ పాలు, కల్తీ నెయ్యికి చెక్​ పెట్టినట్లయింది. మిగతా కంపెనీల పాలు, నెయ్యితో పోలిస్తే విజయ ఉత్పత్తుల్లో నాణ్యత ఎక్కువ. విజయ ఉత్పత్తులు వాడడం ప్రారంభించాక  గతంలో అంగన్​వాడీ సెంటర్లు, ఆలయాల్లోని భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులు పూర్తిగా తగ్గిపోయాయని అధికారులు అంటున్నారు. అదే సమయంలో పాడి రైతులకూ ప్రయోజనం కలుగుతోంది. 

మహిళా సంఘాలకూ మస్తు బాధ్యతలు

కాంగ్రెస్​ సర్కారు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ బడుల రిపేర్లను గతంలో కాంట్రాక్టర్లకు  అప్పగించగా, ఇప్పుడు స్కూళ్ల నిర్వహణ, రిపేర్ల బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ కమిటీ’ పేరుతో మహిళా సంఘాలకు అప్పగించారు. విద్యార్థులకు అవసరమైన స్కూల్​ యూనిఫాంల తయారీ, 150 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణనూ మహిళా సంఘాలకే ఇచ్చారు. అటు ప్రతి జిల్లాకు ఒక్కోటి రూ.కోటిన్నర విలువైన 2 సోలార్​ ప్లాంట్ల చొప్పున మహిళా సంఘాలకే అప్పగించారు. తాజాగా జిల్లాల్లో184  మినీ గోదాములు నిర్మించి మహిళా సంఘాలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

జైళ్ల శాఖకు అంగన్ వాడీ బెంచీల కాంట్రాక్టు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో బెంచీల సరఫరా కాంట్రాక్టును జైళ్ల శాఖకు మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖ అప్పగించింది. రాష్ర్టంలో 35 వేల అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా ప్రతి కేంద్రంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కూర్చునేందుకు ఒక్కో కేంద్రంలో 2 బెంచీల చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇటీవల టెండర్లు పిలవగా నాలుగు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.

ఆయా కంపెనీలకు అర్హత లేకపోవడంతో టెండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లను ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్దు చేశారు. ఇప్పటికే జైళ్లలో ఖైదీలు తయారు చేస్తున్న లాంగ్  టేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విద్యా శాఖతో పాటు పలు గురుకుల సొసైటీల్లో  ఉపయోగిస్తున్నారు. గతేడాది దాదాపు రూ.300 కోట్ల విలువైన కాంట్రాక్టును జైళ్ల శాఖతో ఆయా శాఖలు ఒప్పందం  చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్ వాడీలకు సైతం జైళ్ల శాఖ ద్వారా బెంచీలు సరఫరా చేయాలని మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ సెక్రటరీ అనిత జీఓ జారీ చేశారు.