కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్ సభ సీట్ల పెంపు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ సీట్లను.. 850కు పెంచాలని నిర్ణయిస్తూ.. దీనికి సంబంధించిన ముసాయిదాను ఎంపీలకు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో.. లోక్ సభ సీట్ల పెంపు.. డీలిమిటేషన్ కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.
131 రాజ్యాంగ సవరణకు సిద్ధం అయిన కేంద్రం.. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ చేసింది కేంద్రం. 850 సీట్లకు పెరగనున్న లోక్ సభ సీట్లలో.. 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండనున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై చర్చించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఓ వైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే.. కీలకమైన మహిళా రిజర్వేషన్.. డీలిమిటేషన్ బిల్లులను తెరపైకి తీసుకురావటం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
డీలిమిటేషన్ కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని.. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కాకుండా.. ఆయా రాష్ట్రాల GST, వృద్ధి రేటు, ఆదాయ వనరుల ఆధారంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం.. ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగా.. 50 శాతం అదనంగా ఇవ్వాలనే ప్రాథమిక ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోనున్నాయి. డబ్బులు దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళుతుంటే.. ఉత్తరాధి రాష్ట్రాలు పెత్తనం చేస్తున్నాయని.. ఇది అన్యాయం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇలాంటి టైంలోనే.. కేంద్రం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ముసాయిదా ప్రతిపాదనను తీసుకురావటం విమర్శలకు తావిస్తోంది.

