ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్..ఫుడ్ కాంట్రాక్ట్ రద్దు.. ఆర్‌‌ఎంవో సస్పెన్షన్

ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్..ఫుడ్ కాంట్రాక్ట్ రద్దు.. ఆర్‌‌ఎంవో సస్పెన్షన్
  • విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ 
  • మొత్తం 92 మందికి ఫుడ్ పాయిజన్ 
  • ఉస్మానియా ఆస్పత్రిలో 18 మంది బాధితులు
  • అందరి పరిస్థితి నిలకడగా ఉంది: మంత్రి దామోదర

హైదరాబాద్ సిటీ / బషీర్‌‌‌‌బాగ్, వెలుగు:ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్​ పాయిజన్​ ఘటనపై ప్రభుత్వం సీరియస్​ అయింది. దవాఖాన ఆర్ఎంవో డాక్టర్​ పద్మజను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. అలాగే ఫుడ్​ కాంట్రాక్టర్​ జైపాల్‌‌రెడ్డి కాంట్రాక్ట్‌‌ను రద్దు చేశారు. ఈ ఘటనపై విచారించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో మానసిక రోగులకు స్పెషల్ ఫుడ్ పెట్టారు. అయితే వారిలో 92 మంది మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిల్లాడగా.. హాస్పిటల్​ సిబ్బంది అక్కడే చికిత్స అందించారు. 

ఈ ఘటనలోనే ఒకరు చనిపోయారన్న వార్తలు రాగా, సూపరింటెండెంట్​ఖండించారు. వాస్తవానికి మంగళవారం 70 మంది అస్వస్థతకు గురయ్యారని వార్తలు రాగా, 35 మందికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందని, వారికి దవాఖానాలోనే ట్రీట్‌‌మెంట్​ఇస్తున్నామని సూపరింటెండెంట్​ ప్రకటించారు. బుధవారం మాత్రం మొత్తం 92 మంది అస్వస్థతకు గురయ్యారని, ఇందులో 18 మందికి బీపీ సమస్య రావడంతో ఉస్మానియాకు షిఫ్ట్​ చేశామని ప్రకటించారు. 

ఉస్మానియాలో చేరిన వారంతా వృద్ధులే..

ఉస్మానియాలో 18 మంది మానసిక రోగులు చికిత్స పొందుతుండగా, వీళ్లంతా 60 ఏండ్ల వయస్సు వారే. ఎండీ, న్యూరాలజీ, న్యూరో ఫిజీషియన్, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ వంటి సూపర్​స్పెషాలిటీ డాక్టర్లంతా కోఆర్డినేషన్​ చేసుకుంటూ ట్రీట్‌‌మెంట్​ఇస్తున్నారని సూపరింటెండెంట్‌‌ డాక్టర్ రాకేశ్ సహాయ్ తెలిపారు. పేషెంట్లంతా మానసిక రోగులు కావడంతో ఎర్రగడ్డ​ హాస్పిటల్​లోని సైకియాట్రీ డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకుంటూ చికిత్స చేస్తున్నామన్నారు. 

ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.  అలాగే ఎర్రగడ్డ హాస్పిటల్‌‌లోని పేషెంట్లకు గాంధీ, ఉస్మానియా నుంచి వచ్చిన ఆరు మెడికల్​ టీమ్స్​ ట్రీట్‌‌మెంట్​ఇస్తున్నాయి. ప్రాణాలకు ప్రమాదం లేదని, మరో రెండు రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. 

ఉస్మానియా ఆర్‌‌‌‌ఎంవోకు బాధ్యతలు.. 

ఘటనకు బాధ్యురాలిని చేస్తూ ఆర్ఎంవో పద్మజాను అధికారులు సస్పెండ్​చేశారు. ఆమె స్థానంలో ఉస్మానియా ఆర్ఎంవో బి.శంకర్‌‌‌‌ను ఇన్‌‌చార్జ్‌‌గా నియమించారు. మంత్రి ఆదేశాలతో ఫుడ్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రద్దు చేశారు. తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ ఫుడ్ కాంట్రాక్టర్‌‌కు బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్ కాంట్రాక్ట్ రద్దుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతోపాటు  ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. కమిటీ రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.  

దవాఖానకు ఎంపీ అనిల్..

రాజ్యసభ ఎంపీ అనిల్​ కుమార్​ యాదవ్​ బుధవారం ఎర్రగడ్డ హాస్పిటల్‌‌కు వచ్చారు. పేషెంట్ల కండీషన్​గురించి డాక్టర్లతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తిది భూపాలపల్లి అని, ఆయన ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం రిపోర్ట్​వస్తేనే తెలుస్తుందని చెప్పారు. అస్వస్థత గురైన వారిని చూడడానికి కుటుంబసభ్యులను రానివ్వడం లేదని అంటున్నారని, దీనిపై సూపరింటెండెంట్‌‌తో మాట్లాడినట్టు తెలిపారు. పేషెంట్లు కొంచెం కోలుకున్నాక చూడడానికి అనుమతిస్తామని సూపరింటెండెంట్​చెప్పారని పేర్కొన్నారు. 

మంత్రి పొన్నం విచారం.. 

ఎర్రగడ్డ ఘటనపై హైదరాబాద్ ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షణలో ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు. 

మానవ హక్కుల కమిషన్‌‌కు ఫిర్యాదు

పద్మారావునగర్: ఎర్రగడ్డ ఘటనపై రాష్ర్ట మానవ హక్కుల కమిషన్‌‌కు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని బుధవారం ఫిర్యాదు చేశారు. ‘‘ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కలుషిత ఆహారం తిని కరణ్ అనే రోగి మృతి చెందాడు. మరో 91 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై చర్యలు తీసుకోవాలి” అని అందులో కోరారు. 

‘‘కలుషిత ఆహారంతో మొన్నటి దాకా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో చిన్నారులు దవాఖానల పాలయ్యారు. తాజా ఘటనలో మానసిక రోగులు అనారోగ్యానికి గురయ్యారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్​చోంగ్తూ నేతృత్వంలో దర్యాప్తు జరపాలి. దవాఖానలో నెలకొన్న పరిస్థితులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: దామోదర 

హెల్త్ ​మినిస్టర్ ​దామోదర రాజనర్సింహ బుధవారం ఎర్రగడ్డ హాస్పిటల్‌‌ను విజిట్​ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 92 మంది రోగులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. తెలంగాణ అవతరణ​దినోత్సవం సందర్భంగా దవాఖానలో స్పెషల్​ఫుడ్​పెట్టారని, అందులో భాగంగా ఇచ్చిన స్వీట్​వల్లే ఇలా జరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఫుడ్‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ కాంట్రాక్ట్​రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. 

అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఒకరు ఫుడ్​పాయిజన్​వల్లే చనిపోయారని వార్తలు వచ్చాయని.. అయితే పోస్ట్​మార్టం, ల్యాబ్​రిపోర్ట్స్​ఆధారంగా నిజాలు బయటకు వస్తాయన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు.