- ఇరిగేషన్ బడ్జెట్ లెక్కల్లో ఇచ్చంత్రం
- ఏడాదిలో 9.94 లక్షల ఎకరాలకు నీళ్లు
- టార్గెట్ నింపిన కాళేశ్వరం ఎత్తిపోతలు
- దేవాదుల టార్గెట్లో మూడో వంతు, ఎస్ఎల్బీసీలో సగానికి పరిమితం
సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాల్లో ఇచ్చంత్రం ముచ్చట ఇది. ప్రాణహిత ప్రాజెక్టు నుంచి ఏకంగా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పింది. ఇరిగేషన్ పోర్టుపోలియో చూస్తున్న సీఎం కేసీఆర్ పేరు మీద ఈ లెక్కలను అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. ప్రాణహిత పేరుతో పేపర్ మీద తప్ప నదిపై ఎక్కడా బ్యారేజీ కట్టింది లేదు. ఉమ్మడి ఏపీలో తుమ్మిడిహెట్టి సమీపం నుంచి మైలారం వరకు తవ్విన కాలువ తప్ప ఇంకేమీ పనులు అక్కడ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది తప్ప తుమ్మిడిహెట్టి కాడ తట్టెడు మట్టి కూడా తీయలేదని స్వయంగా సీఎం కేసీఆర్ చాలాసార్ల విమర్శించిన్రు. అప్రాప్రియేషన్ బిల్లుపై చర్చ సందర్భంలోనూ తుమ్మిడిహెట్టిపై కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నట్టు కాగితం చూపిస్తే పదవికే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కానీ తన పేరుతో చట్టసభకు సమర్పించిన లెక్కల్లోని లోపాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఉమ్మడి ఏపీలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు నీటిని ఎత్తిపోయాలని సంకల్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత -చేవెళ్ల సుజల స్రవంతి పథకంగా దీనికి పేరు పెట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఆరు ప్యాకేజీల్లో పనులు చేయాలని నిర్ణయించారు. ఎల్లంపల్లి తర్వాత ప్రస్తుతం ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల స్కీమ్లైన్ అలైన్మెంట్ పాత ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో చేసిందే. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ, మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంటుందని 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉందని చెప్తూ రీ ఇంజినీరింగ్ పేరుతో బ్యారేజీని మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపు హౌస్లను మూడేళ్లలోనే పూర్తి చేసి ఈ యేడు ఎత్తిపోతలు కూడా మొదలు పెట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడగడ్డకు బ్యారేజీని మార్చిన టైమ్లో అప్పటి ఆదిలాబాద్ తూర్పు జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు పాత ప్రతిపాదిత స్థలంలోనే బ్యారేజీ నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయని వార్దాపై బ్యారేజీ నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. వ్యాప్కోస్తో దీనికోసం డీపీఆర్ కూడా చేయించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమోగానీ రెండు చోట్లలో ఎక్కడా బ్యారేజీ కట్టలేదు. కొత్తగా చెన్నూరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై చిన్న లిఫ్టులు పెట్టేందుకు స్టడీ చేయడానికి ఇటీవలే అనుమతులు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో అసలు ప్రాణహిత ప్రాజెక్టు ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానాలు ఇంజనీర్లలోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అసలే కట్టని ప్రాజెక్టు నుంచి ఏకంగా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా చెప్తోంది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో మిగిలిన 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రాణహిత నుంచి ఎలా నీళ్లు ఇచ్చారని సీనియర్ ఇంజనీర్లను అడుగగా డేటా చూసి వాళ్లు సైతం అవాక్కయ్యారు. ఆ లెక్కలు తప్పేనని వారు పరోక్షంగా అంగీకరించారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,76,374 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చినట్టుగా పేర్కొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 2019 – 20లో 9,40,442 ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది సభకు సమర్పించిన బడ్జెట్ ఫలితాల్లో కొత్తగా 9,94,556 ఎకరాలను సాగులోకి తెచ్చినట్టుగా పేర్కొంది. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం టార్గెట్ కన్నా 54,114 ఎకరాలకు అధనంగా నీళ్లు ఇచ్చింది. కానీ ప్రాణహిత నుంచి ఇచ్చినట్టుగా చెప్తోన్న 50 వేల ఎకరాలకు నీటిని ఇచ్చే చాన్స్ లేకపోవడంతో మొత్తం లెక్కలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేవాదుల లిఫ్ట్ స్కీమ్ నుంచి 4,00,931 ఎకరా లకు నీళ్లివ్వాలని టార్గెట్ పెట్టుకోగా 1,22,062 ఎకరాలకు మాత్రమే ఇవ్వగలిగారు. ఏఎమ్మార్ ఎస్సెల్బీసీ నుంచి 1,26,286 ఎకరాలకు గాను 50 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద 56,032 ఎకరాలకు 45,052 ఎకరాలకు మాత్రమే అందాయి. ప్రతిపాదిత ఆయకట్టు 3.90 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు 2 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయి.
కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ నుంచి 1,17,105 ఎకరాలకు గాను 87,816 ఎకరాలకు నీళ్లిచ్చారు. ఎల్లంపలి లిఫ్ట్ స్కీమ్ కింద 1,33,808 ఎకరాలకు గాను 89,400 ఎకరాలకు నీళ్లిచ్చారు. చిన్న కాళేశ్వరం ఆయకట్టు 45,280 ఎకరాలకు 25 వేల ఎకరాలకు నీళ్లిచ్చారు. వరద కాలువ కింద 40 వేల ఎకరాలు, లోయర్ పెన్గంగా కింద 25,396 ఎకరాలకు నీళ్లిచ్చారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లతో 2,99,800 ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి 51,750 ఎకరాలు, మీడియం ఇరిగేషన్లో కొత్తగా 33 వేల ఎకరాలు, ఐడీసీ కింద 27 వేల ఎకరాలకు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు.
