పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడటం లేదు: బండి సంజయ్

పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడటం లేదు: బండి సంజయ్

పొలిటికల్ మైలజ్ కోసం రైతు సమస్యలపై తాము మాట్లాడడం లేదని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్.  రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

రైతుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలన్నారు ఎంపీ బండి సంజయ్. మంత్రులు మాపై విమర్శలు చేయడం మానుకుని… కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలన్నారు. కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుందన్నారు. బీజేపీ నేతలపై…  మంత్రులు ,TRS నేతలు విమర్శలు చేస్తుంటే… సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు.

కేటీఆర్ నియోజకవర్గం…కేసీఆర్ అత్తగారి ఊళ్లోనే కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారని ఆరోపించారు. ఓ మంత్రి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.. మరి అలాంటప్పుడు సీఎం కేసీఆర్ ప్రతి గింజ రైతుల దగ్గర కొంటామని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. రైతులు ధాన్యాన్ని కాల్చివేసుకొని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది.. దీని పైన కూడా TRS నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ రాజకీయాలు రాజకీయాలు చేయడం లేదన్న బండి సంజయ్…కరోనా వైరస్ విషయం లో ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తున్నామన్నారు. రైతుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావద్దన్నారు.

అంతకుముందు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ను కలిశారు ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి. ఆ తర్వాత మాట్లాడిన సంజయ్.. గవర్నర్ కు కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న పరిస్థితిని వివరించామన్నారు. గవర్నర్ పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.