హైదరాబాద్లో అన్నీ కరెంట్ బండ్లే.. జిల్లాలకు డీజిల్ బస్సులు .. ఓఆర్ఆర్ లోపల ఆటోలు తిరగాలంటే..

హైదరాబాద్లో అన్నీ కరెంట్ బండ్లే.. జిల్లాలకు డీజిల్ బస్సులు .. ఓఆర్ఆర్ లోపల ఆటోలు  తిరగాలంటే..
  • ఎలక్ట్రిక్ వెహికల్స్​ @ హైదరాబాద్
  • సిటీలో శరవేగంగా పెరుగుతున్న కరెంట్ బండ్లు 
  • త్వరలో ఆర్టీసీకి 2,500ఎలక్ట్రిక్ బస్సులు
  • ప్రస్తుతమున్న డీజిల్ బస్సులన్నీ జిల్లాలకు తరలింపు
  • ఓఆర్ఆర్ లోపల 20 వేల ఎలక్ట్రిక్, మరో 20 వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పర్మిషన్
  • ప్రస్తుతమున్న 25 వేల డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వెసులుబాటు 
  • ఈవీలకు లైఫ్, రోడ్ ట్యాక్స్‌‌ నుంచి 100 శాతం మినహాయింపు 
  • డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు 

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్​ బైకులు.. ఎలక్ట్రిక్​ ఆటోలు.. ఎలక్ట్రిక్​ కార్లు.. ఎలక్ట్రిక్ బస్సులు.. ఇలా హైదరాబాద్ ​సిటీ రోడ్లపై ఎటుచూసినా ఎలక్ట్రిక్ ​వెహికల్స్​ పరుగులు తీస్తున్నాయి.  నో సౌండ్.. నో పొల్యూషన్​.. జీరో మెయింటనెన్స్‌‌కి తోడు జీరో లైఫ్​ట్యాక్స్​ అంటూ సర్కార్ ప్రోత్సహిస్తుండడంతో కరెంట్ బండ్లను కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.  గతేడాది రాష్ట్రంలో 52,134 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్​కాగా, ఈ ఏడాది ఇప్పటికే 78,862 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌‌లో ఎలక్ట్రిక్​వాహనాల జోరు పెరుగుతున్నదని అర్థం చేసుకోవచ్చు. 

దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్​ట్రాన్స్‌‌పోర్ట్‌‌లోనూ ఎలక్ట్రిక్​వాహనాలకు ప్రోత్సహిస్తున్నాయి. ‘పొల్యూషన్​ఫ్రీ హైదరాబాద్’లో భాగంగా కేంద్రం నుంచి త్వరలోనే సిటీ ఆర్టీసీకి విడతల వారీగా 2 ,500 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయి. ఇవి రాగానే ఇప్పటికే ఉన్న పాత డీజిల్​బస్సులను జిల్లాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఓఆర్ఆర్ లోపల 20 వేల ఎలక్ట్రిక్, మరో 20 వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పర్మిషన్​ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్.. ప్రస్తుతమున్న 25 వేల డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నది. మొత్తం మీద రాబోయే పదేండ్లలో డీజిల్, పెట్రోల్ వెహికిల్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌‌ను మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 

పొల్యూషన్​ ఫ్రీ సిటీ లక్ష్యం..

రాబోయే పదేండ్లలో హైదరాబాద్‌‌ను  ‘పొల్యూషన్​ఫ్రీ సిటీ’ గా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఢిల్లీ లాంటి పరిస్థితి మనకు రావద్దని, కాలుష్యం నుంచి హైదరాబాద్​నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ట్రాన్స్‌‌పోర్ట్​మినిస్టర్​ పొన్నం ప్రభాకర్​పలు వేదికలపై పేర్కొన్నారు. 

ఇందుకు తగ్గట్లే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌‌‌‌లో ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్’ పాలసీ తెచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం రెండేళ్ల పాటు (2026 డిసెంబర్ 31 వరకు) ఎలక్ట్రిక్ వాహనాలకు లైఫ్​ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్​నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చింది. ఈ స్కీమ్​ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు అనూహ్యంగా పెరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లక్షా 70వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, వీటిలో అత్యధికంగా 1.3 లక్షల ఎలక్ట్రిక్​ బైకులు కాగా  12,765 కార్లు ఉన్నాయి. గతేడాది రాష్ట్రంలో 52,134 ఎలక్ట్రిక్ వెహికిల్స్​రిజిస్టర్​​కాగా, ఈ ఏడాది  ఇప్పటికే 78,862 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. 

దీన్ని బట్టి రాష్ట్రంలో ఎలక్ట్రిక్​వాహనాల జోరు క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా నో నాయిస్​, జీరో మెయింటనెన్స్ కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్​వెహికల్స్‌‌కు మారుతున్నారని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో తగినన్ని చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం విద్యుత్ వాహనాల యజమానులకు సమస్యగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 700 వరకు ఎలక్ట్రిక్ వెహికల్​చార్జింగ్ స్టేషన్లు ఉండగా.. పెరుగుతున్న వాహన అవసరాలను తీర్చడం లేదు. 

ఈ ఏడాది చివరిలోగా వీటి సంఖ్యను 2వేలకు పెంచడం, సిటీతో పాటు అన్ని హైవేల వెంట ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవేళ చార్జింగ్​స్టేషన్ల సంఖ్య భారీగా పెరిగితే ఎలక్ట్రిక్​వాహనాల కొనుగోళ్లు మరింత ఊపందుకునే అవకాశముందని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. 

పబ్లిక్ ​ట్రాన్స్‌‌పోర్ట్‌‌లోనూ విప్లవాత్మక మార్పులు.. 

కొన్నేండ్లుగా హైదరాబాద్‌‌లో పబ్లిక్​ట్రాన్స్‌‌పోర్ట్​సిస్టమ్‌‌లోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. 2017 నవంబర్‌‌‌‌లో హైదరాబాద్‌‌లో ప్రారంభమైన మెట్రో67 కిలోమీటర్ల నెట్‌‌వర్క్‌‌తో ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఇటీవల హైదరాబాద్​మెట్రో రెండో దశను రూ.24,269 కోట్ల అంచనాలతో 76.4 కిలోమీటర్ల విస్తరణ పనులకు రాష్ట్ర సర్కారు డీపీఆర్​సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. రెండోదశ అనుమతులు రాగానే మూడోదశ పనులనూ పట్టాలెక్కించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

 దీనికితోడు పీఎం ఈ– డ్రైవ్​ స్కీమ్‌‌లో భాగంగా హైదరాబాద్‌‌కు 5వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ది ఫాస్టర్​ అడాప్షన్​ అండ్​ మ్యాన్యుఫాక్చరింగ్​ఆఫ్​ఎలక్ట్రిక్​వెహికిల్స్​(ఫేమ్)​ స్కీమ్​కింద గతంలో కేంద్రం నుంచి వచ్చిన బస్సులను ఎయిర్​పోర్ట్‌‌తో పాటు పలు రూట్లలో తిప్పుతున్న సంగతి తెలిసిందే.  ఆ తర్వాత  పీఎం ఈ-–డ్రైవ్ స్కీమ్​ ప్రవేశపెట్టడంతో దీనికింద వీలైనన్ని ఎక్కువ బస్సులు కేటాయించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలోనే 2 ,500 బస్సులు ఇచ్చేందుకు ఆయన అంగీకరించగా, ఇవి విడతల వారీగా హైదరాబాద్  చేరుకోనున్నాయి. వచ్చే ఎలక్ట్రిక్​బస్సుల సంఖ్యను బట్టి ఇప్పటికే సిటీలో నడుస్తున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. 

ప్రస్తుతం 200 ఈ–బస్‌‌లు.. 

ఆర్టీసీలో ఇప్పటికే సుమారు 200 ఎలక్ట్రిక్ బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటితో పాటు గ్రేటర్‌‌‌‌లో కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, మరో 20 వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవి రాగానే ప్రస్తుతం సిటీలో నడుస్తున్న డీజిల్, పెట్రోల్​ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చనున్నారు. ఇందులో ఇప్పటికే 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్​ఆటోలుగా మార్చుకునేందుకు రవాణా శాఖ అనుమతిచ్చింది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే సౌండ్, పొల్యూషన్​ఫ్రీ సిటీ సాధ్యమవుతుందని ఎక్స్‌‌పర్ట్స్ అంటున్నారు.