
సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు. అంతకుముందు పెండింగ్ బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా.. రెండు బిల్లులను తిరస్కరించారు. మరో రెండు బిల్లులు పరిశీలనలో ఉన్నట్టు రాజ్ భవన్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి రెండు బిల్లులను రిజెక్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళి సై వద్ద రాష్ట్రానికి సంబంధించిన పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ ఇంతకుముందే చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది.