అమ్రాబాద్, వెలుగు: నల్లమల అడవుల్లో జీవిస్తున్న చెంచుల జీవనవిధానం, ఆర్థిక స్థితిగతులపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో చర్చించారు. శనివారం కుటుంబ సమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకొని హైదరాబాద్కు వెళ్తూ నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని మృగవని గెస్ట్ హౌస్లో కాసేపు విరామం తీసుకున్నారు.
ఈ సందర్భంగా నల్లమలలోని చెంచుల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ దత్తత తీసుకున్న చెంచు పెంటల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సోలార్ విద్యుత్, తాగునీటి సౌలతి, నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఉన్న సహజ వనరులు, జలపాతాలు, వన్య మృగాలు, శైవ క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. అనంతరం ఏటీఆర్లోని పులి ఫొటోతో కూడిన జ్ఞాపికను గవర్నర్ కు అందజేశారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఎఫ్ వో రేవంత్ చంద్ర, ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ రాములు పాల్గొన్నారు.
