
- జీతాలు పెంచి..ఉద్యోగ భద్రత కల్పించాలి: సీఐటీయూ
హైదరాబాద్, వెలుగు: తమ వేతనాలను పెండింగ్ పెట్టకుండా నెలనెలా కచ్చితంగా చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కార్మికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. "నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు" అని చెప్పారు.
స్వీపర్లకు రూ.15,600 చెల్లించాలి
జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని ప్రభుత్వాన్ని పాలడుగు భాస్కర్ కోరారు. పంచాయతీ సిబ్బందిని 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. జీవో 51ను సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని.. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్లు కల్పించాలన్నారు.
పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేసి..60 ఏండ్లు దాటిన వారికి రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, వారిస్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు.