- వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ శివార్చన వేదిక వద్ద ఈ నెల 6న నిర్వహించనున్న శివ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి సూచించారు. మంగళవారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, అర్చకులు, ఉద్యోగులు, వివిధ విభాగాల సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉత్సవాల సమయంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. భీమేశ్వర ఆలయంలో దర్శన ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం, తాగునీరు, శానిటేషన్, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆలయం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేపట్టి, విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. సమావేశంలో ఈఈ రాజయ్య, డీఈ రఘునందన్, ఏఈవోలు శ్రవణ్కుమార్, జయకుమారి, సూపరింటెండెంట్ శ్రీనివాస్శర్మ, ప్రధాన అర్చకుడు శరత్, తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజులపాటు ఉత్సవాలు
శివార్చన వేదిక వద్ద 6న పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5 నుంచి 9 వరకు శివ కల్యాణం సందర్భంగా ఏకాంతంగా ఉత్సవాలు జరగనున్నాయి. 8న స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.
