కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. మార్క్ఫెడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆలయం వరకు సాగింది. ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవమూర్తులతో ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని(ట్రాక్టర్) సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్వయంగా నడిపారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఉత్సాహపరిచారు. యాత్రలో డప్పు కళాకారులు విన్యాసాలు, గుస్సాడి బృందం నృత్యాలు, మహిళల కోలాటాలు, భజనలు, పంచ వాయిద్యాలు, ఒగ్గుడోలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీవారిని తొమ్మిది రథాల్లో విద్యుత్దీపాల కాంతులతో ఊరేగించారు.
లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, వంశపారంపర్య ట్రస్టు సభ్యులు చకిలం గంగాధర్, ఎండోమెంట్ శాఖ ఈవో సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు సిరిపురం మనోజ్, కోమళ్ల శిరీష, ఉప్పల బాలాజి, స్వప్న, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
