మనవడు ఆడుకుంటూ ఆడుకుంటూ బోరుగుంతలో పడిపోయాడు. అది చూసి తల్లడిల్లిన తాత.. వెంటనే కాపాడేందుకు బోరుగుంత దగ్గరకు పరిగెత్తాడు. మనవడిని కాపాడే ప్రయత్నంలో ప్రమాద వశాత్తు తాత కూడా గుంతలో పడిపోయాడు. తీరా చూస్తే మనవడు బతికాడు కానీ తాత చనిపోయాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో 2026 మే 16న జరిగింది ఈ విషాద ఘటన. గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో బోరు గుంతలో ప్రమాద వశాత్తు నాలుగేళ్ల బాలుడు పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు వెళ్లి అదే బోరు గుంతలో తాత వెంకన్న ఇరుక్కుపోయాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. బోరు గుంతలోంచి తాత, మనవడిని బయటకు తీశారు. ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న(53) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో వెంకన్న మరణించడంతో ఊట్లపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
