గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలోని గ్రేప్ రిసర్చ్ స్టేషన్లో శనివారం గ్రేప్స్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 12వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తరలివచ్చిన రైతులకు ద్రాక్ష సాగుపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
నిజాం కాలం నుంచి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పరిశోధనా కేంద్రం.. 1977 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రస్తుతం ఇక్కడ 65 రకాల ద్రాక్ష వంగడాలు సాగులో ఉన్నాయని ఆయన వివరించారు. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ పరిసరాల్లో ప్రస్తుతం 600.67 ఎకరాల్లో మాత్రమే ద్రాక్ష సాగు అవుతోందని, ప్రజలకు నాణ్యమైన ద్రాక్షను అందించేందుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు.
