
- పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు అయ్యాయి. జూన్ 5 నుంచి12 వరకూ ఏడు రోజుల పాటు పరీక్షలుంటాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 11వ తేదీన ఆదివారం మినహా ప్రతిరోజూ ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం గతేడాది ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థుల నుంచి 3.80 లక్షల దరఖాస్తులు రాగా, అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది అటెండ్ అయ్యారు. డిసెంబర్లో పికప్ లిస్టు వచ్చింది.
దీంట్లో ఇటీవలే 1:50 రేషియోలో 20,050 మందిని మెయిన్కు ఎంపిక చేశారు. వీరికి జూన్ 5 నుంచి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించింది. పరీక్షా కేంద్రాలన్నీ హైదరాబాద్ చుట్టు పక్కల ఏరియాల్లోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాయొచ్చని పేర్కొంది. అయితే జనరల్ ఇంగ్లిష్ టెన్త్ స్టాండర్డ్లో ఉంటుందని, ఈ ఎగ్జామ్ అందరూ ఇంగ్లిష్లోనే రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఇంగ్లిష్లో క్వాలిఫై అయితే సరిపోతుందని, మిగిలిన వాటిలో మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.