కాంగ్రెస్​లో మళ్లా లొల్లి

కాంగ్రెస్​లో మళ్లా లొల్లి
  • కాంగ్రెస్​లో మళ్లా లొల్లి
  • రాహుల్​టూర్​ టైమ్​లోనూ ఒక్కతాటిపైకి రాని నేతలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర కాంగ్రెస్ ​నేతల మధ్య మళ్లీ లొల్లులు రచ్చకెక్కాయి. వారం రోజుల్లో రాహుల్​ గాంధీ రానుండగా.. ముఖ్య నేతల మధ్య రోజుకొక్క పంచాది నడుస్తున్నది. అందరూ ఒక్క తాటి మీద నిలబడి పని చేయాల్సిన సమయంలో రెండు వర్గాలుగా చీలిపోవడం ఏమిటని కేడర్​ ఆందోళన చెందుతున్నది. నేతల మధ్య ఉన్న గ్యాప్​ రాహుల్​ పర్యటన సన్నాహాక సమావేశాల్లో స్పష్టంగా బయటపడుతున్నది. శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ సమావేశం దాన్ని  మరింత తారా స్థాయికి తీసుకుపోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తూ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఈ మీటింగ్​కు వెళ్లలేదు. గాంధీభవన్​లో జరిగిన పీఏసీ సమావేశానికి వచ్చిన నేతలు నల్గొండ​ ఎపిసోడ్​పై తలోవిధంగా స్పందించారు. రాష్ట్ర నేతల మధ్య పంచాది మళ్లోసారి ఏఐసీసీ దృష్టికి వెళ్లింది. 

చీఫ్​ ఎక్కడైనా తిరగొచ్చు.. కానీ.. 
నాగార్జునసాగర్​ సన్నాహక సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ముఖ్య నేతలంతా సాయంత్రం గాంధీభవన్​లో జరిగిన పీఏసీ సమావేశానికి తరలివచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రటరీలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంలో మీటింగ్​కు  వచ్చిన నేతల్ని నల్గొండ ఎపిసోడ్​పై మీడియా కదిలిస్తే.. తమ అభిప్రాయాలు చెప్పారు. పీసీసీ మాజీ చీఫ్​, ఎంపీ  ఉత్తమ్​కుమార్​రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ ప్రెసిడెంట్​ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చని, అయితే ఆ జిల్లా నేతలకు సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. తమ మధ్య విభేదాలు లేవని ఆయన చెప్పారు. పీఏసీ చైర్మన్​ షబ్బీర్​ అలీ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడ్ని జిల్లాలకు రాకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. నిజామాబాద్​లో పార్టీ బలహీనంగా ఉందనే కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. అదే జిల్లాకు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ స్పందిస్తూ.. నిజామాబాద్​లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కోమటిరెడ్డి నిజామాబాద్​ వస్తా అంటే స్వాగతిస్తానని చెప్పారు. తాను గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొందరు కోవర్ట్​ ఆపరేషన్​ చేశారని ఆయన ఆరోపించారు. నల్గొండలో కాంగ్రెస్​ బలంగా ఉంటే ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఎంపీగా ఉండి హుజూర్​నగర్​ ఎన్నికల్లో పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రశ్నించారు. జిల్లాల్లో బలంగా ఉన్నామని వాపును చూసి బలుపు అనుకోవద్దన్నారు. వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేష్ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు ఏ జిల్లాకు పోవాలన్నా డీసీసీకి ఇన్ఫర్మేషన్​ ఇస్తారని, ఇలా ఇవ్వకుండా వెళ్తే  మాత్రం తప్పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే హక్కు ఆయనకు ఉందని చెప్పారు. కోమటిరెడ్డి, ఇతర నాయకులు మాట్లాడిన మాటల్ని ఏఐసీసీ పరిశీలిస్తోందన్నారు. 

ఇదీ పంచాది..!
కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మే 6, 7 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మొదటి రోజు వరంగల్​లో రైతు సమస్యలపై సంఘర్షణ సభ తలపెట్టారు. దీనికి భారీగా జన సమీకరణ చేయాలని నేతలంతా నిర్ణయించారు. ఐదు లక్షల మంది సభకు వస్తారని ప్రకటించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఉమ్మడి  వరంగల్​, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో స్థానిక నేతలతో కలిసి మీటింగ్​లు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 27న నల్గొండ జిల్లా సమావేశం ఏర్పాటు చేయాలని రెండు రోజుల ముందు నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా నేతలైన సీఎల్పీ  మాజీ నేత జానారెడ్డి, ఎంపీలు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి ఇవ్వలేదు. ఇది తెలుసుకున్న వీరు సమావేశాన్ని వాయిదా వేయించారు. దాంతో అదే జిల్లాకు చెందిన నేతలు అద్దంకి దయాకర్​ తదితరులు కొందరు కార్యకర్తలతో భేటీ ఏర్పాటు చేసి.. రేవంత్​ను జిల్లాకు రాకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ప్రకటించారు. ఈ లోపు  పార్టీ నేతలు నల్గొండ జిల్లా సమావేశ నిర్వహణ బాధ్యతను జానారెడ్డికి అప్పజెప్పారు. ఆయన శుక్రవారం నాగార్జున సాగర్​లో మీటింగ్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గురువారం స్పందిస్తూ.. నల్గొండ కాంగ్రెస్​కు కంచుకోట అనీ, ఉద్ధండులైన నాయకులున్న జిల్లాల్లో సమావేశం అవసరం లేదని ప్రకటించారు. జన సమీకరణ తాము చూసుకుంటామని, పార్టీ వీక్​గా ఉన్న నిజామాబాద్​, ఆదిలాబాద్​ లాంటి జిల్లాల్లో రేవంత్​ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. తాను నల్గొండ జిల్లాలో జరిగే మీటింగ్​కు వెళ్లడం లేదని కూడా ప్రకటించారు. స్టార్​ క్యాంపెయినర్​గా నియమితులయ్యాక కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హైదరాబాద్​ వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ.. తమ మధ్య విబేధాలు సమసిపోయాయని, అందరం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. కానీ పది రోజులకే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనికి రేవంత్​ రెడ్డి వైఖరే కారణమని కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. నల్గొండ సమావేశం గురించి కనీస సమాచారం ఇవ్వకుండా ఎట్లా తేదీలు అనౌన్స్​ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక వరంగల్​ సమావేశంలో రేవంత్..​ జన సమీకరణ గురించి తాను చూసుకుంటానని, దానికి తాను బాధ్యత వహిస్తానని ప్రకటించడాన్ని కోమటిరెడ్డి వర్గీయులు తప్పుబడుతున్నారు. రేవంత్​ ఆ కామెంట్​ చేసే సమయానికి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూడా పక్కనే ఉన్నారు. సమిష్టి నాయకత్వంలో జరగాల్సిన రాహుల్​ సభ నిర్వహణ విషయంలో రేవంత్​ వన్​ మ్యాన్​ షో చేస్తున్నారంటూ ఆరోజు నుంచే ఆయన గుర్రుగా ఉన్నారు. అగ్గి మీద ఆజ్యం పోసినట్లు నల్గొండ సభ గురించి ముందే చెప్పకపోవడంతో వివాదం మరింత ముదిరింది. కరీంనగర్​లో జరిగిన సమావేశంలో కూడా ఫ్లెక్సీల్లో జీవన్​ రెడ్డి ఫొటో లేదని కొందరు విమర్శించారు. ఖమ్మంలో భట్టి, రేణుకా చౌదరి వర్గీయుల బల ప్రదర్శనతో జిల్లా పార్టీ ఆఫీసులో తోపులాట జరిగింది. రాహుల్​ సభకు ఇంకా వారం సమయం ఉంది. అప్పటి వరకు ఇంకెన్ని విభేదాలు బయటపడతాయోనని కొందరు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.