
భోపాల్(మధ్యప్రదేశ్): అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు డాక్టర్లు వీలైతే ట్రీట్మెంట్ చేసి పంపిస్తరు.. లేదంటే వేరే ఆస్పత్రికి పోవాలని సూచిస్తరు. మధ్యప్రదేశ్లో ఓ ఆస్పత్రిలో మాత్రం పేషెంట్ను ఈడ్చి అవతల పారేసిన్రు. మహిళ అని కూడా చూడకుండా.. ఆస్పత్రి లోపల నుంచి బయట గేటుదాకా దాదాపు 300 మీటర్ల దూరం మట్టి, బురదలో నుంచి సెక్యూరిటీ గార్డు ఈడ్చుకుంటూ తీసుకపోయిండు. భోపాల్కు 320 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోనె సిటీలో జరిగిందీ దారుణం. ఈ సంఘటనను కొంతమంది ఫొటో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారినయ్. దీనిపై ఆస్పత్రి మేనేజ్మెంట్ స్పందించింది. ఆస్పత్రి గేటుకు అడ్డంగా కూర్చున్న మహిళను సెక్యూరిటీ గార్డు పక్కకు జరిపాడని, ఈడ్చడంలాంటిదేమీ జరగలేదని చెప్పింది. మెంటల్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఆ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి ఆస్పత్రిలో వదిలేసి వెళ్లారని పేర్కొంది. బాధిత మహిళ ఆస్పత్రి సిబ్బందిని తిడుతూ, మిస్బిహేవ్ చేస్తుంటే అవతలికి తీసుకెళ్లాలని చెప్పినట్లు అక్కడి అధికారులు చెప్పారు. దీంతో సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లాడని అన్నారు. బయటికి తీసుకెళుతుంటే ఆమె గేటు ముందు కూర్చుండిపోవడంతో గార్డ్ పక్కకు జరిపాడని తెలిపారు. అయితే, ఈ ఫొటోలు వైరల్ కావడంతో సదరు సెక్యూరిటీ గార్డును హాస్పిటల్ మేనేజ్మెంట్ తొలగించింది.