
Oman Income Tax: ఇప్పటి వరకు చాలా మంది భారతీయులతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ప్రజలు ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది డబ్బున్నోళ్లు కూడా అక్కడ స్థిరపడుతున్నారు. దీనంతటికీ కారణం అక్కడి ప్రభుత్వాలు ప్రజల నుంచి ఎలాంటి ఆదాయపు పన్ను వసూలు చేయకపోవటమే. కానీ గల్ఫ్ దేశాలు త్వరలోనే ఈ ఊరటను తొలగించవచ్చనే హింట్ ఒమన్ చర్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఒమన్ 2028 నుంచి ఆ దేశ ప్రజలపై ఆదాయపు పన్ను భారం వేయాలని నిర్ణయించింది. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయనున్న తొలి గల్ఫ్ దేశంగా కూడా ఇది నిలుస్తుంది. వార్షికంగా ఆదాయం 42వేల రియాల్స్ దాటిన వ్యక్తుల నుంచి మాత్రమే 5 శాతం ఇన్కమ్ టాక్స్ వసూలు చేయాలని ఒమన్ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల కేవలం 1 శాతం అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు మాత్రమే ప్రభావితం అవుతారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయిల్ నుంచి వస్తున్న ఆదాయంపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | పెరిగే ఆయిల్ ధరలతో ఈ రంగాలకు ప్రమాదం.. ఏ స్టాక్స్ ప్రభావితం ఔతాయంటే?
సామాజిక వ్యయాన్ని కాపాడుతూ చమురు ఆదాయంపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ చర్య లక్ష్యమని ఆర్థిక మంత్రి సయీద్ బిన్ మొహమ్మద్ అల్-సక్రీ అన్నారు. ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని దేశాలు ఇప్పటి వరకు ప్రజల నుంచి ఆదాయంపై పన్నులను వసూలు చేయటం లేదు. ఇది భారీగా విదేశాలకు చెందిన అధిక వేతనం కలిగిన కార్మికులను ఆకర్షించింది. కానీ ఒమన్ వేస్తున్న సంస్కరణల ముందడుగు పెద్ద మార్పులకు రానున్న కాలంలో దారితీయనుంది. ఒమన్ పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే ఆర్థిక సంస్కరణలతో ముందుకు సాగాలని చూస్తోంది.
ప్రస్తుతం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని సౌదీ అరేబియా, బహ్రెయిన్ మినహా మిగిన దేశాలు బలమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రెండు దేశాలు మాత్రమే లోటు బడ్జెట్లో ఉండగా.. ఐఎంఎఫ్ ఈ దేశాలు త్వరలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లకు వెళ్లాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం తగ్గంట, గ్రీన్ ఎనర్జీ వైపుకు అడుగుల మధ్య ఆయిల్ వ్యాపార ఆదాయలపై డిపెండెన్సీని తగ్గించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈ దేశాలకు సూచిస్తోంది. దీంతో ఒమన్ తర్వాత భవిష్యత్తులో మిగిలిన దేశాలు కూడా ఇదే దారిలో అడుగులువేయెచ్చు.