
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. రణరంగంలోకి అమెరికా ఎంట్రీతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. రష్యా నుంచి హిజ్బుల్లా వరకు అందరూ ఇరాన్ కి సాయం అందించలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇరాన్ ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించిన వేళ క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. ఇది భారత మార్కెట్లలోనూ అనేక కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హర్మూజ్ మార్గం ద్వారానే ప్రపంచానికి దాదాపు 20 శాతం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల రవాణా జరుగుతోంది. దీనిని బ్లాక్ చేస్తే పరిస్థితులు అదుపుతప్పుతాయని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భారతదేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, విమానయాన సంస్థలు, పెయింట్స్, టైర్స్ అండ్ ఆటోమెుబైల్స్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ రంగాల కంపెనీలు ప్రభావితం కానున్నాయి.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో నేరుగా ప్రభావితం అయ్యే స్టాక్స్ హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నాయి. పెరుగుదున్న ధరలు కంపెనీల లాభదాయకతను తగ్గించనుంది. ఆయిల్ రేట్లు పెరుగుదల దేశీయ విమానయాన రంగాన్ని ప్రభావితం చేయనుంది. ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, ఎయిర్ ఇండియా వంటి సంస్థల వ్యాపారం ప్రభావితం కానుంది. పెరిగే ఇంధన ధరలు కంపెనీలపై ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. దీంతో కంపెనీల ఆపరేటింగ్ ఖర్చులు పెరుగుతాయని తెలుస్తోంది. అలాగే ఎయిర్ స్పేస్ క్లోజర్ ప్రయాణ దూరాన్ని ఖర్చులను పెంచుతుంది.
ఇక పెయింట్స్ రంగంలోని కంపెనీల వ్యాపారం కూడా క్రూడ్ ధరల పెరుగుదలతో ముడిపడి ఉన్నందున ప్రభావితం అవనుంది. దీంతో ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరొల్యాక్ పెయింట్స్ సంస్థలు ఒత్తిడిని చూడనున్నాయి. పెయింట్స్ రంగంలో ఉపయోగించే సాల్వెంట్స్, ముడిసరుకుల ధరలు కూడా దీనివల్ల పెరుగుతాయని తేలింది.
►ALSO READ | యుద్ధ రంగంలోకి అమెరికా ఎంట్రీ.. కుప్పకూలిన భారత మార్కెట్లు.
ఇదే క్రమంలో కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ రంగానికి చెందిన చంబల్ ఫెర్టిలైజర్స్, నాగార్జున్ ఫెర్టిలైజర్స్, ఆర్సీఎఫ్, సుప్రీమ్ పెట్రోకెమ్, పనామా పెట్రోకెమ్, డీసీడబ్ల్యూ, మనాలీ పెట్రోకెమికల్స్, దీపక్ నైట్రైట్, బేయర్ కార్ప్సైన్స్, నవీన్ ఫ్రోరిన్, విమాటీ ఆర్గానిక్స్, టాటా కెమికల్స్, ఎస్ఆర్ఎఫ్ వంటి కంపెనీల షేర్లు ప్రతికూలంగా ప్రభావితం కానున్నాయి. ఇదే క్రమంలో ఆటో రంగం ఉత్పత్తి ఖర్చుల పెరుగుదలను చూడటం ద్వారా సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హుందాయ్, ఐషర్ వంటి కంపెనీల షేర్లు రానున్న కొన్ని రోజుల్లో ప్రభావితం అవుతాయని తెలుస్తోంది.