
Market Crash: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీపతనంలో కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇదే దారిలో కొనసాగుతున్న ఇతర సూచీలు సైతం నష్టాలతో ఉన్నాయి. అయితే మార్కె్ట్ల పతనానికి కారణమైన కీలక కారణాలను ఇన్వెస్టర్లు తప్పక పరిశీలించాలి.
* ముందుగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదలను చూస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెంట్ ధర 78 డాలర్లకు చేరుకుంది. ఇరాన్ లోని అణు ప్రాంతాలపై అమెరికా వారాంతంలో చేసిన దాడులు ఆయిల్ ధరలను కుతకుతలాడిస్తున్నాయి. ప్రధానంగా రవాణా నిలిచిపోతుందనే భయాలు పెరిగాయి. ఇరాన్ ప్రభుత్వం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాక్ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీయ ఆయిల్ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి.
* అమెరికా బాంబుల వర్షం కురిపించటంతో యుద్ధంలోకి అడుగుపెడుతుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అణు కేంద్రాలపై దాడులతో పరిస్థితులు ముదురుతున్నాయి.
* ఆసియా మార్కెట్లు నేడు ప్రధానంగా నష్టాల్లో కొనసాగటం ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయి. దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ మార్కెట్ సూచీలు నష్టాలతో ఉన్నాయి. దీనికి ముందు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ప్రయాణాన్ని ముగించిన సంగతి తెలిసిందే.
* భారతీయ ఐటీ రంగంలోని కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ సంస్థ యాక్సెంచర్ మార్చి త్రైమాసికంలో తక్కువ ఆదాయ వృద్ధిని సూచించటం ఈ రంగంపై అనిశ్చితిని పెంచేస్తోంది.