రాజశేఖర్ వర్మ, రితిక, భవ్యశ్రీ హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రం ‘కాళాంకి భైరవుడు’. హరి హరన్ వి దర్శకత్వంలో కె.ఎన్. రావు, డా. రచ్చమల్ల శ్రీనివాస రావు నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ కొత్త టాలెంట్తో వస్తోన్న ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధించాలని కోరాడు.
హీరో రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ ఇది. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని అన్నాడు. ఇందులో నటించడం సంతోషంగా ఉందని హీరోయిన్ రితిక, భవ్యశ్రీ చెప్పారు.
దర్శకుడు హరి హరన్ మాట్లాడుతూ ‘నా జీవితంలో ప్రత్యక్షంగా ఎదుర్కొన్న రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందించా’ అని అన్నాడు. నిర్మాత కెఎన్ రావు మాట్లాడుతూ ‘అవుట్పుట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. వచ్చే నెల 24న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు.
