
- యూపీ నుంచి వచ్చి మూడు షాపులు నడుపుతున్న యువకులు
- జల్సాలకు అలవాటు పడి అందులోనే దందా
ఎల్బీనగర్, వెలుగు: సెలూన్షాపు ముసుగులో అక్రమంగా తుపాకులు అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను మహేశ్వరం జోన్ ఎస్ఓటీ, బాలాపూర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. బుధవారం ఎల్బీనగర్లోని తన క్యాంపు ఆఫీస్లో రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. యూపీలోని రాంపూర్కు చెందిన మహ్మద్ జీషన్ అలియాస్ జీఖాన్ 2016లో తన కుటుంబంతో కలిసి సిటీకి వలస వచ్చాడు. సంతోష్ నగర్లో నివాసం ఉంటూ రక్షాపురం, గోల్కొండ, బాలాపూర్ లో మరో మూడు హెయిర్ సెలూన్ షాపులు ఏర్పాటు చేశాడు.
తన సొంతూరుకు చెందిన అతని స్నేహితుడు మహ్మద్ అమీర్ (24)ను కూడా సిటీకి తీసుకువచ్చి, బాలాపూర్ ఎక్స్ రోడ్ లోని తన షాపులో పనికిపెట్టాడు. సెలూన్ల ద్వారా వచ్చే ఆదాయం తన జల్సాలు, లగ్జరీ జీవితానికి సరిపోక ఆయుధాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అమీర్కు తెలియజేయగా, అతను కూడా అంగీకరించాడు. దీంతో యూపీలో అక్రమ తుపాకుల తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్న తన మరో స్నేహితుడు అర్షిఖాన్ ను సంప్రదించి, 5 రకాల తుపాకులను తక్కువ ధరకు కొనుగోలు చేశారు.
అనంతరం వాటిని హైదరాబాద్కు తీసుకొచ్చి, సంఘ వ్యతిరేక శక్తులకు ఒక్కోటి రూ.2 లక్షలకు విక్రయించడానికి తమ వద్ద ఉంచుకున్నారు. బుధవారం ఉదయం జీషన్, అమీర్కలిసి బాలాపూర్ సెలూన్ లో తుపాకులు ఉంచడానికి వెళ్తుండగా, విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 కంట్రీమేడ్ తుపాకులు, 18 రౌండ్ల బుల్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం
చేసుకున్నారు.