మర్కజ్‌కు వెళ్లిన వారికి నెగటివ్‌ వస్తే పోలీసులకు అప్పగించండి

మర్కజ్‌కు వెళ్లిన వారికి నెగటివ్‌ వస్తే పోలీసులకు అప్పగించండి
  • ఢిల్లీ అధికారులు

న్యూఢిల్లీ: నిజాముద్దీన్‌లో మార్చిలో జరిగిన మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న 567 మంది ఫారినర్లకు కరోనా నెగటివ్‌ వస్తే వారిని పోలీసులకు అప్పగించాలని ఢిల్లీ అధికారులు ఆదేశించారు. కేంద్ర హోంశాఖ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సీనియర్‌‌ అధికారి చెప్పారు. తబ్లిగీ జమ్మాత్‌లో పాల్గొన్న 2446 మంది మన దేశానికి చెందిన వారు ఢిల్లీలోని క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారని, వారందరికీ నెగటివ్‌ వస్తే హెల్త్ ప్రొటోకాల్‌ ప్రకారం వాళ్లను ఇళ్లకు పంపాలని అన్నారు. ఇళ్లకు వెళ్లేందుకు పాస్‌లు జారీ చేయాలని, డైరెక్ట్‌గా ఇంటికి వెళ్లేలా చూడాలని, ప్రొటోకాల్‌, సోషల్‌ డిస్టెంసింగ్‌కు భంగం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిషేదాజ్ఞలు ఉన్నప్పటికీ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆ ప్రార్థనల్లో పాల్గొనగా వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో తబ్లిగ్‌ చీఫ్‌పై కేసు నమోదు చేసిన ప్రభుత్వం వీసా రూల్స్‌ను ఉల్లంఘించిన వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.