
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: 2025–--26 విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురుకుల స్కూళ్ల సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్ లో జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లోని వివిధ కోర్సులు, ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.
గురుకుల డిగ్రీ కళాశాలలో అందిస్తున్న కోర్సుల్లో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. జేఈఈలో 336 ర్యాంకు సాధించిన మడికొండ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని జి.సింధూజను కలెక్టర్ అభినందించారు. విద్యార్థిని ప్రతిభను తెలియజేస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
విజ్ఞాన కేంద్రం పనులు పూర్తిచెయ్యాలి
భీమదేవరపల్లి: పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులు ఆమె పరిశీలించారు. ఈ నెల 28 నాటికి సిద్ధంగా ఉంచాలన్నారు.
ఈ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి మహిళా సంఘం సభ్యులకు వారం రోజుల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం మండల పరిధిలోని ముల్కనూరులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ విషయాలను తెలుసుకున్నారు. వేగంగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.