ఐదేండ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలి

ఐదేండ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలి

హనుమకొండ సిటీ, వెలుగు: ఐదేండ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు దగ్గర్లోని అంగన్​వాడీ కేంద్రాల్లో చేర్చాలని హనుమకొండ కలెక్టర్  స్నేహ శబరీశ్​ అన్నారు. డీడబ్ల్యూవో జయంతి ఆధ్వర్యంలో మంగళవారం 49వ డివిజన్ జులైవాడ అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించిన ‘అమ్మమాట -అంగన్​వాడీ బాట’ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పిల్లలతో అక్షరాభ్యాసం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు శారీరక పెరుగుదలతో పాటు మానసిక, సామాజిక, మేధో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ హనుమకొండ సీడీపీవో ఎం.విశ్వజ, సూపర్వైజర్స్ వి.రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి 

హసన్ పర్తి : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు అందుతాయని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హసన్ పర్తి మండలం పెంబర్తిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూదన్ పల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు.