
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
- శాయంపేట పీఏసీఎస్కు తాళం వేసిన రైతులు
- పురుగుల మందు డబ్బాతో ఆఫీసు వద్ద నిరసన
- పోలీసుల జోక్యంతో ఫిర్యాదు చేసిన రైతులు
శాయంపేట, వెలుగు: సర్కార్ మళ్లీ రుణమాఫీ చేస్తుందని నమ్మించి రైతుల వద్ద పీఏసీఎస్ఆఫీసర్లు వడ్డీ వసూలు చేసి మోసగించిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. దీంతో రైతులు పురుగుల మందు డబ్బాలతో వెళ్లి పీఏసీఎస్ఆఫీసుకు తాళం వేసి నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళ్తితే.. శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన పృథ్వీ, కొగిల సదానందం స్థానిక ప్రాథమిక సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో తీసుకున్న లోన్ కు కాంగ్రెస్సర్కార్ రూ.60వేలు, రూ.1.10లక్షలు రుణ మాఫీ చేసింది. గతేడాది జూలైలో వడ్డీ కట్టాలని, ఇతర ఖర్చులకు ఇద్దరి వద్ద రూ.10వేల చొప్పున పీఏసీఎస్ఇన్ చార్జ్ సీఈఓ శంకర్వసూలు చేశాడు.
పృథ్వీ రూ. 80 వేలు, సదానందంకు రూ.1.50 లక్షల రుణం మంజూరు చేశారు. కాగా.. మళ్లీ రుణ మాఫీ చేసే చాన్స్ ఉందని, అందుకు మరో రూ.25వేలు ఇస్తే మాఫీ చేస్తానని రైతులను ఆఫీసర్ నమ్మించాడు. దీంతో పృథ్వీ రూ.25వేలు ఇచ్చాడు. నెలలు గడుస్తుండగా పీఏసీఎస్ సిబ్బంది అతని ఇంటికి వెళ్లి వడ్డీ కట్టాలని నిలదీశారు. దీంతో అవాక్కైన పృథ్వీ.. సదానందంతో కలిసి వెళ్లి ఆఫీసులో సీఈఓ శంకర్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో పాటు రైతులను బెదిరించాడని బాధితులు వాపోయారు. పృథ్వీ తన రుణం రూ.50వేలు ఇచ్చేసి పట్టా పాస్బుక్ఇవ్వమని కోరారు.
అయినా ఇన్ చార్జ్ సీఈఓ శంకర్ స్పందించలేదు. దీంతో గత మే25న జిల్లా ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. అక్కడి ఆఫీసర్లు కూడా నిర్లక్ష్యం చేశారు. దీంతో పృథ్వీ, సదానందం బుధవారం పీఏసీఎస్ నోడల్ ఆఫీసర్ను కలిసి తమ గోడు చెప్పుకోగా.. ఆమె కూడా స్పందించలేదు. అనంతరం శాయంపేట పీఏసీఎస్వద్దకు చేరుకుని ఆఫీసుకు తాళం వేసి పురుగుమందు డబ్బాతో ఇద్దరు రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శంకర్ను పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని సీఐ రంజిత్రావు హామీ ఇచ్చారు. అనంతరం రైతుల నుంచి ఫిర్యాదు తీసుకుని పంపించారు.