పైసల కోసం గొడవ.. వ్యక్తి హత్య..హనుమకొండ సుబేదారిలో ఘటన

పైసల కోసం గొడవ.. వ్యక్తి హత్య..హనుమకొండ సుబేదారిలో ఘటన

హనుమకొండ, వెలుగు : ఆర్థికపరమైన కారణాలతో ముగ్గురు యువకులు వరుసకు బాబాయ్‌‌‌‌ అయ్యే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన హనుమకొండ పట్టణంలోని సుబేదారి పీఎస్‌‌‌‌ పరిధిలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్డేపల్లి టీఎన్‌‌‌‌జీవోస్‌‌‌‌ కాలనీకి చెందిన మహ్మద్‌‌‌‌ సాధిఖ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (48) ఆటోడ్రైవర్‌‌‌‌గా పనిచేస్తూ దేవి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇతడు తన పెదనాన్న కొడుకు అయిన ఖాదర్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ అలియాస్‌‌‌‌ బబ్లూకు గతంలో రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. రూ.లక్ష తిరిగిచ్చిన తర్వాత ఖాదర్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ చనిపోయాడు. మిగతా డబ్బుల విషయంలో ఖాదర్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ కొడుకులు మహ్మద్‌‌‌‌ సోహైల్‌‌‌‌, బాసిర్‌‌‌‌తో సాధిఖ్‌‌‌‌కు గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో బుధవారం రాత్రి 11.30 గంటలకు సోహైల్‌‌‌‌, బాసిర్‌‌‌‌ కలిసి సాధిఖ్‌‌‌‌ ఇంటికి వచ్చి మాట్లాడుకుందామని బయటకు తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మాట్లాడుకుంటున్న క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో సోహైల్, బాసిర్‌‌‌‌ కలిసి మహ్మద్‌‌‌‌ అక్రమ్‌‌‌‌ అనే వ్యక్తిని పిలిచారు. ముగ్గురు కలిసి సాధిఖ్‌‌‌‌పై బండరాళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని గమనించిన దేవి గట్టిగా కేకలు వేస్తూ చుట్టు పక్కల వాళ్లను పిలువడంతో ముగ్గురు అక్కడి నుంచి పరార్‌‌‌‌ అయ్యారు. స్థానికులు ఘటనాస్థలానికి చేరుకునే సరికే సాధిఖ్‌‌‌‌ చనిపోయాడు. వెంటనే సుబేదారి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి వివరాలు సేకరించారు. సాధిఖ్‌‌‌‌ సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.