
సిద్దిపేట రూరల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను గోసపుచ్చుకుంటున్నాడని, కేసీఆర్ లేని లోటు గమనిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గంగమ్మ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ పాలనలో భూముల రేట్లు చాలా తగ్గాయన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ రావాలని, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జ్ఞానం ఉందో లేదో తెలియడం లేదని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదని అంటున్నారని, రంగనాయకసాగర్ నుంచి సిద్దిపేట ప్రాంత పొలాలకు ప్రాజెక్ట్ నీళ్లు వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కొంతమంది మూర్ఖులు కాళేశ్వరంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఏం తింటున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ బతుకుదెరువు చూపిస్తే, ఈ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, మాజీ జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు ఉన్నారు.