సభ నడిపే పద్ధతి ఇది కాదు : హరీశ్ రావు

సభ నడిపే పద్ధతి ఇది కాదు : హరీశ్ రావు
  •     పద్దులో ఏముందో తెలియకుండా కట్​మోషన్​ ఎలా ఇస్తం: హరీశ్ రావు
  •     పద్దులను ఇప్పటిదాకా ఇవ్వలేదని నిరసిస్తూ వాకౌట్​ 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ అంటే అధికారులకు లెక్కలేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. టూరిజం, ఆర్ట్స్, కల్చరల్, స్పోర్ట్స్, మైనారిటీ వెల్ఫేర్​పద్దుల బుక్కులు ఇప్పటిదాకా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పద్దులో ఏముందో తెలియకుండా కట్​మోషన్ ​ఎలా ఇస్తామని ప్రశ్నించారు. మంగళవారం సభలో ఆయన పాయింట్​ఆఫ్​ ఆర్డర్​ లేవనెత్తారు. 

సభను నడిపే పద్ధతి ఇది కాదంటూ విమర్శించారు. సభ ఉదయం 10 గంటలకు స్టార్ట్​ కావాల్సి ఉన్నా మొదలు పెట్టడం లేదని, టీ బ్రేకులు 10 నిమిషాలని చెప్పి 4 గంటలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రిప్లై రోజు ఢిల్లీ టూర్​ నుంచి తిరిగి 
రావాలన్న కారణంతో అంత లేట్​ చేశారన్నారు. సీఎం రిప్లై ఇచ్చాక కనీసం తాము క్లారిఫికేషన్​ అడిగితే కూడా ఇవ్వకుంటే సభలో తామెందుకు కూర్చోవాలని నిలదీశారు. సోమవారం కూడా 12 గంటలకు టీ బ్రేక్​ ఇస్తే.. 3.30 దాకా మళ్లీ ప్రారంభించలేదన్నారు. 

తాను సభలో మాట్లాడేది ఉందని ఎప్పుడు బెల్​కొడతారోనని సభలోనే కూర్చుండిపోయానన్నారు. మంగళవారం కూడా భట్టి ప్రిపరేషన్ కోసమని బ్రేక్​ను గంటన్నర సేపు ఇచ్చారన్నారు. దానికి నిరసనగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలంతా.. భట్టి విక్రమార్క రిప్లై వినకుండానే సభ నుంచి వాకౌట్​ చేశారు. కాగా, అసెంబ్లీ గ్రౌండ్​లో ఈ నెల 28, 29వ తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్టు స్పీకర్​ తెలిపారు. ఆసక్తి ఉన్న సభ్యులు బుధవారం సెక్రటరీకి పేర్లు ఇవ్వాలని స్పీకర్​ అసెంబ్లీలో ప్రకటించారు.  

పార్టీ ఆఫీసును నడిపినట్టు నడిపిన్రు: మంత్రి శ్రీధర్​ బాబు

సభ నడిపే తీరు బీఆర్​ఎస్​ వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో.. పార్టీ ఆఫీసును నడిపినట్టే సభను నడిపారని మండిపడ్డారు. సీఎం స్పీచ్​ తర్వాత ఎన్ని ప్రశ్నలు అడిగినా.. జవాబు చెప్పారని, క్లారిఫికేషన్​ ఇచ్చారని గుర్తుచేశారు. మంగళవారం సభలో హరీశ్ ​రావుకు ఆయన కౌంటర్​ ఇచ్చారు. 

బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కూడా బడ్జెట్​ పద్దులను.. ఆనాటి ఆర్థిక మంత్రి రిప్లై ఇవ్వడానికి ఐదు నిమిషాల ముందు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఇక్కడ ఒకటో రెండో పుస్తకాలివ్వనందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. ఒక్కోసారి సభ లేట్​ అవుతుందని, దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ వాళ్లకు అంత పెద్ద పనేముందని వాకౌట్​ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భట్టి రిప్లైకి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. రెండింతల జవాబొస్తుందని భయపడి సభ నుంచి వాకౌట్​ చేశారని ఫైర్​ అయ్యారు.