- 35 ఏండ్లు కష్టపడి పనిచేసిన వారిని రోడ్ల మీదకు తెచ్చిన్రు
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట రూరల్, వెలుగు : ఉద్యోగులు దాచుకున్న డబ్బులను వారికి ఇచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డికి మనసు రావడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు హరీశ్రావు మద్దతు ప్రకటించి మాట్లాడారు. 35 ఏండ్లు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులను సీఎం రేవంత్రెడ్డి రోడ్ల మీదకు తెచ్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోందని, పెండింగ్లో ఉన్న డీఏను ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. రూ. 10 వేల కోట్ల బకాయిలు ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే.. తనను కోసుకొని తిన్నా డబ్బులు లేవని సీఎం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మూసీ అభివృద్ధి పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయడం, 10 వేల ఇండ్లు కూల్చేందుకు సిద్ధం అయిన రేవంత్రెడ్డి.. బడా కాంట్రాక్టర్లకు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు, కమిషన్లు ఇచ్చే వారికే డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులకు ఇవ్వరని విమర్శించారు. పెన్షన్ బెనిఫిట్స్ రాక 60 మంది చనిపోయారని, వారి చావుకు కారణం సీఎం రేవంత్రెడ్డేనని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెలలోపే బెనిఫిట్స్ ఇచ్చామని గుర్తు చేశారు. విద్యా కమిషన్ రిపోర్ట్ ఉపాధ్యాయులను అవమానించేలా ఉందని మండిపడ్డారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్న రేవంత్రెడ్డి.. అందులో రూ. 10 వేల కోట్లను రిటైర్డ్ ఉద్యోగుల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.
