కోల్కతా: ఈడెన్లో గులాబీ గుబాళించింది. బీసీసీఐ నయా బాస్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో.. గ్రౌండ్కు పోటెత్తిన అభిమానుల సాక్షిగా.. అతిరథ మహారథుల సమక్షంలో.. హిస్టారికల్ డేనైట్ మ్యాచ్ యావత్ దేశాన్ని కనువిందు చేసింది. కోహ్లీ సేన తొలిసారి పింక్ బాల్తో ఆడుతుండటం.. చరిత్రలో నిలిచిపోయే విధంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఏర్పాట్లు చేయడం.. దాదా సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మ్యాచ్పై బాగా హైప్ క్రియేటైంది. దీంతో ఇప్పటికే నాలుగు రోజుల టికెట్లు పూర్తిగా అమ్ముడవ్వగా.. మ్యాచ్ ఆరంభం ముందు ఒక్క టికెట్టు బ్లాక్లో ఏకంగా మూడు, నాలుగు రెట్లు పలికింది. పరిస్థితులను చూస్తే ఇది టెస్టు మ్యాచా? లేక టీ20నా? అనే సందేహాన్ని కలిగించాయి. అభిమానులతో నిండిన ఈడెన్ గ్యాలరీలు.. 2001లో ఆస్ట్రేలియాపై 171 రన్స్తో గెలిచిన అద్భుత మ్యాచ్ను గుర్తు చేశాయి.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో సహా ముఖ్య అతిధులందరికి క్యాబ్ రెడ్ కార్పెట్తో ఆహ్వానం పలికింది. ఇక టాస్కు 5 నిమిషాల ముందు చీఫ్ గెస్ట్లుగా వచ్చిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సచిన్.. ఇరు జట్ల ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన సిల్వర్ కాయిన్తో టాస్ వేయగా.. హసీనా, మమతా ఈడెన్ బెల్ మోగించడంతో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్కు బంగ్లా ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ నైముర్ రెహ్మాన్తో పాటు ఆటగాళ్లు.. ఇండియా మాజీ క్రికెటర్లు రమేశ్, సబా కరీం, సునీల్ జోషి, అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, అజరుద్దీన్, శ్రీకాంత్, ఫరూక్ ఇంజనీర్ తదితరులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఇతర క్రీడల దిగ్గజాలు అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, సానియా మీర్జా, మేరీకోమ్లు సైతం అటెండయ్యారు. బ్రేక్ టైమ్లో గోల్ఫ్ కార్ట్లలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే ఒక్కొక్కరు మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయగా.. వారిని అనుసరిస్తూ.. మహిళా క్రికెట్ లెజెండ్స్ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, శాంత రంగస్వామి, ఇండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, శ్రీకాంత్ కనువిందు చేశారు. ఫస్ట్ డే ఆట ముగిసిన అనంతరం గెస్టులను సన్మానించారు.