
న్యూఢిల్లీ, వెలుగు: నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ అజరుద్దీన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు వ్యవహారంలో ఏం చెప్పాలనుకున్నా హైకోర్టులోనే చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హెచ్సీఏ లీగ్ మ్యాచ్ల్లో నల్గొండ క్రికెట్ అసోసియేషన్ టీమ్స్ను ఆడించాలన్న తమ ఆదేశాలను పాటించకపోవడంతో అజర్కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీన్ని అజర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ను శుక్రవారం విచారించిన సుప్రీం బెంచ్ ‘మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడలేదా?’అని ప్రశ్నించింది. లేదని అజరుద్దీన్ తరపు సీనియర్ అడ్వకేట్ చెప్పడంతో బెంచ్ కొంత సీరియస్ అయింది. అయితే మంచిదని వ్యాఖ్యానిస్తూ... హైకోర్టుకు వెళ్లి అదే సమాధానం చెప్పండీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఈ పిటిషన్ ను రిపీల్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అజర్ తరపు అడ్వకేట్ కోరడంతో అంగీకరించిన బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ ముగిస్తున్నట్లు వెల్లడించింది.