న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి నిరాకరించారు. సీఈఓగా మరో టర్మ్ కొనసాగడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.
గత మూడు దశాబ్దాలుగా బ్యాంకులో సేవలందిస్తున్న 61 ఏళ్ల జగదీశన్, ఈ ఏడాది అక్టోబర్ 26న పదవీ విరమణ చేయనున్నారు. బోర్డు సభ్యులు ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడ్డారు. దీంతో కొత్త సీఈఓ ఎంపిక ప్రక్రియను బోర్డు వేగవంతం చేయనుంది.
కార్పొరేట్ ఇండియాలోనే అతిపెద్ద విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో, బ్యాంకు వృద్ధి, స్థిరత్వంలో జగదీశన్ అందించిన విశేష నాయకత్వ సేవలను బోర్డు కొనియాడింది. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గవర్నెన్స్, నైతిక విలువలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఏడాది మార్చిలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి వైదొలిగారు.
