IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో భాగంగా కాసేపట్లో (2026, మే 1న) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో నెంబర్ 2లో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటాన్స్ (GT) తలపడబోతుంది. కొన్ని రోజుల క్రితమే బెంగళూరు చేతిలో ఓటమి పాలైన గుజరాత్కు, సొంత గడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు దక్కింది.
జోరు మీదున్న ఆర్సీబీ.. తలవంచని టైటాన్స్:
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన గత మ్యాచ్లో కేవలం 75 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి, బౌలింగ్లో తమ ప్రతాపాన్ని చూపిన ఆర్సీబీ జట్టు ప్రస్తుతం మంచి ఊపులో కనిపిస్తుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇక బెంగళూరు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్లను వీరు ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన 7 మ్యాచుల్లో బెంగళూరు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. RCB 4 మ్యాచులలో విజయం సాధించగా, గుజరాత్ మాత్రం 3 మ్యాచులలో గెలిచింది. ప్రస్తుత సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ టీమ్ ఆడిన 8 మ్యాచుల్లో 6 విజయాలతో మంచి జోరు కొనసాగిస్తోంది.
పిచ్ రిపోర్ట్:
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా సహకారం లభించే అవకాశం ఉంటుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు మొదట ఫీల్డింగ్ తీసుకుని, లక్ష్యాన్ని ఛేదించడానికే మొగ్గు చూపుతాయి.

