సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేయాలి : హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ

సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేయాలి : హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ

హనుమకొండ, వెలుగు: సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఇతర విభాగాలతో సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా.ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా డీఎంహెచ్వోలతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులపై ఆరా తీశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ డీఎంహెచ్వో, ఇతర అధికారులు ఎంజీఎం ఆస్పత్రిలో నమోదవుతున్న మలేరియా, డెంగ్యూ పాజిటివ్ కేసుల వివరాలను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల లోపు సంబంధిత జిల్లాల డీఎంహెచ్వో లకు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావణం తయారు చేసే విధానం, జ్వరాలు, డయేరియా లక్షణాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉందన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్వోలు స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా అవసరం ఉన్నవారికి  ఎక్స్ రే  నిర్వహించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత డీఎంహెచ్వోలు సికిల్ సెల్ అనీమియా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని డీఎంహెచ్​వోలు ఏ.అప్పయ్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జున్, రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

జనగామ, నర్సంపేట ఆస్పత్రుల తనిఖీ

జనగామ/ నర్సంపేట: ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు వైద్య విద్య కళాశాలలకు ఎన్ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా.ఎస్.సంగీత సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆమె జనగామ, నర్సంపేట మెడికల్ కళాశాలలు, జిల్లా ఆస్పత్రులను ఆయా జిల్లాల కలెక్టర్లు రిజ్వాన్​ బాషా షేక్, సత్యశారదతో కలిసి పరిశీలించారు.

జనగామ మెడికల్​ కాలేజీని ప్రిన్సిపల్​ గోపాల్​రావు, నర్సంపేట వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రిన్సిపల్ మోహన్​దాస్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలోని పలు విభాగాలను కమిషనర్ పరిశీలించి, సౌకర్యాలపై ఆరా తీశారు.  అనంతరం అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించి పలు సూచనలు చేశారు.