బిజినెస్ డెస్క్, వెలుగు: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి కరోనా ట్రీట్మెంట్ ఖర్చులన్ని ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయనుకుంటే కష్టమే. హాస్పిటల్స్ వేస్తున్న బిల్లులకు, ఇన్సూరెన్స్ కంపెనీలు సెటిల్ చేస్తున్న క్లయిమ్స్కు మధ్య పొంతనే ఉండడం లేదు. మిగిలిన అమౌంట్ను పేషెంట్లు కట్టేంత వరకు హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. హాస్పిటల్ బిల్స్ కంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తున్న అమౌంట్ తక్కువగా ఉంటోంది. పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం వాడే పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజేషన్ వంటి వాటిపై విధించే బిల్లులను పే చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి.
పాలసీ హోల్డర్లు వీటిని గమనించాలి…
పీపీఈ కిట్ల ఖర్చులపై క్లారిటీ లేదు..
కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్లో వాడే పీపీఈ కిట్ల ఖర్చులపై హాస్పిటల్స్కు, ఇన్సూరెన్స్ కంపెనీలకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ‘ఒక పేషెంట్కు రోజుకి రెండు పీపీఈ కిట్ల బిల్లును వేస్తాం. కొన్ని హాస్పిటల్స్లలో ఇంత కంటే ఎక్కువ బిల్లులు వేస్తున్నారు. నర్సులు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు, వార్డ్ బాయ్స్ అందరూ కూడా పీపీఈలను వాడాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఖర్చులను భరించడం లేదు. ఈ కంపెనీలు ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ ఎక్విప్మెంట్ లేకుండా పేషెంట్లకు ట్రీట్ చేయలేం’ అని ముంబైకి చెందిన ఓ హాస్పిటల్ చెయిన్ చైర్మన్ అన్నారు. పీపీఈలు, మాస్కులు, గ్లౌవ్స్ల ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయని ప్రుడెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఎంప్లాయి బెనిఫిట్స్ హెడ్ సురిందర్ భగత్ అన్నారు. సాధారణంగా హాస్పిటల్స్ రోజుకి 2–4 పీపీఈ కిట్ల బిల్స్ను వేస్తున్నాయని చెప్పారు. ఈ ఖర్చులను కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొద్ది మొత్తంలో చెల్లిస్తుండగా, మరికొన్ని పూర్తిగా చెల్లించడం లేదని అన్నారు.
కరోనా డయగ్నోస్టిక్ టెస్ట్లకే డబ్బులు
కరోనా డయగ్నోస్టిక్ టెస్ట్లకు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు చెల్లిస్తున్నాయి. పాలసీ హోల్డర్కు కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్ బిల్లు ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు క్లయిమ్స్ సెటిల్ చేయాలి. కానీ కరోనా టెస్ట్ తర్వాత కన్ఫర్మేషన్ కోసం డయాలసిస్ లేదా సర్జికల్ ప్రొసిజర్ వంటివి చేయాల్సి వస్తే వాటికి డబ్బులు చెల్లించడానికి ఈ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఇవి కరోనాకు సంబంధించినవి కాదని చెబుతున్నాయి. జూన్ 26 నాటికి ప్రుడెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ సేకరించిన డేటా ప్రకారం సగటున కరోనా పేషెంట్ల క్లయిమ్ సైజ్ రూ. 1.79 లక్షలుగా ఉంది. కానీ చివరికి సెటిల్మెంట్ మాత్రం రూ. 1.35 లక్షలకే జరుగుతోంది. కేవలం అర్బన్ ఏరియాలనే తీసుకుంటే ఈ క్లయిమ్ సైజ్ రూ. 2-–2.5 లక్షల వరకు ఉంటోంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) లు వాడడం, పేషెంట్కు ఇతర రోగాలుండడం వంటి పరిస్థితులలో ఈ క్లయిమ్ సైజ్ రూ. 6–-8 లక్షలుగా ఉంటోంది. కరోనా డయగ్నోస్టిక్ టెస్ట్కు సుమారు రూ. 2,250 లు బిల్లవుతోంది.
అన్నింటిని పాలసీ కవర్ చేయడం లేదు..
హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వేసే రిజిస్ట్రేషన్ లేదా అడ్మిషన్ ఛార్జీలను ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవు. లాండ్రీ ఛార్జీలు, టాయిలేటరీస్(సబ్బులు, షాంపూ వంటివి), హియరింగ్, వాకింగ్ మెషిన్లకు అయ్యే ఖర్చులను చెల్లించవు. సబ్ లిమిట్స్, కో–పే, నాన్ మెడికల్స్ వంటి క్లాజ్ల వలన చెల్లించాల్సిన క్లయిమ్స్లలో ఈ కంపెనీలు డిడక్షన్ను పొందుతున్నాయి. దీంతో ఇవి సెటిల్ చేస్తున్న అమౌంట్ హాస్పిటల్ బిల్స్ కంటే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు హాస్పిటల్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నా, కంటి చికిత్స(కాటరాక్ట్ ) కు గరిష్టంగా రూ. 25 వేలునే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. బిల్స్ను సెటిల్ చేసేటప్పుడు పాలసీలోని కో–పే క్లాజ్ వలన పేషెంట్లు బిల్ అమౌంట్లో 10–30 శాతం వరకు కట్టాల్సి వస్తోంది.
హాస్పిటల్ రూమ్ రెంట్పై లిమిట్..
పేషెంట్ హాస్పిటల్ రూమ్కు అయ్యే రెంట్పై ఇన్సూరెన్స్ కంపెనీలు పరిమితులు విధిస్తాయి. పాలసీ కవర్ చేస్తున్న మొత్తంలో రోజుకి 1–2 శాతం మాత్రమే దీని కోసం చెల్లిస్తున్నాయి. ఈ రూమ్ సబ్– లిమిట్ క్లాజ్ ఇన్సూరెన్స్ పాలసీలోనే ఉంటుంది. ఈ లిమిట్కు మించి రూమ్ రెంట్ ఎక్కువగా ఉంటే ఆ డబ్బులను ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ కవర్ వాల్యూ రూ. 5 లక్షలు అనుకుంటే, రోజుకి హాస్పిటల్ రూమ్ రెంట్కు రూ. 5,000 వరకు మాత్రమే(మొత్తం కవర్లో 1 శాతం) ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. ఈ సబ్లిమిట్ క్లాజ్ డాక్టర్ల ఫీజు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు వంటి వాటిపై కూడా ఉంటాయి.ప్రస్తుత పరిస్థితులలో ఐసోలేషన్, శానిటేషన్, హైజీన్ వంటి కారణాలతో హాస్పిటల్స్ రూమ్ రెంట్ కాస్ట్ ఎక్కువవుతోంది. ఇది పేషెంట్ల పాలసీలో లిమిట్ కంటే ఎక్కువగా ఉంటోంది. మరోవైపు హౌస్కీపింగ్ ఛార్జీలను సపరేట్గా వేస్తే ఆ డబ్బులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించడం లేదు.