
నలుగురు కుమారులు..ఒక కుమార్తె...కంటికి రెప్పలా సాదుకున్నాడు. పెళ్లిళ్లు చేశాడు. తనకున్న ఆస్తిని పంచి ఇచ్చాడు. ఆస్తిని పంచుకున్న కుమారులు..కన్నతండ్రిని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వంతుల వారీగా తండ్రిని పోషించాలని అనుకున్నారు. ఈ నిర్ణయంతో ఆ తండ్రి గుండె పగిలింది. వంతుల జీవితాన్ని వెళ్లదీయలేక..కుమారులకు భారం అయ్యానన్న బాధతో 90 ఏండ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చితిని తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
సిద్దిపేట జిల్లా పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఐదుగురికి పెళ్లిళ్లు చేశాడు. అయితే కొన్నేండ్ల క్రితమే వెంకటయ్య భార్య చనిపోయింది. ఈ నలుగురు కుమారులు కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నలుగురు కుమారుల్లో ఇద్దరు కుమారులు పొట్లపల్లిలో ఉంటుండగా... ఒకరు హుస్నాబాద్లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్పేటలో స్థిరపడ్డారు. వెంకటయ్య .. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కూడా కుమారులకు సమానంగా పంచేశాడు. వెంకటయ్యకువృద్ధాప్య పింఛన్ వస్తోంది. దాంతోనే ఖర్చులు వెళ్లతీసుకుంటూ..తన పెద్దకొడుకు కనకయ్య ఇంట్లోనే ఉంటున్నాడు.
తండ్రి పోషణ కోసం గొడవ...
5 నెలల క్రితం వెంకటయ్య పోషణపై కుమారుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తండ్రి వెంకటయ్యను ఎవరు పోషించాలన్న దానిపై పొట్లపల్లిలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రి వెంకటయ్యను పోషించాలని పెద్దమనుషులు నిర్ణయించారు. పొట్లపల్లి గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెంకటయ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సొంతూరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య .. మే 2వ తేదీ అదే గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. అదే రోజు రాత్రి ఆ నాయకుడి ఇంట్లోనే ఉన్నాడు.
తనకు తానే చితి పేర్చుకుని...
3వ తేదీన పొద్దున లేచిన వెంకటయ్య రెండో కుమారుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి పొట్లపల్లి నుంచి బయల్దేరాడు. కానీ సాయంత్రం వరకు కూడా ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అయితే మే 4వ తేదీ గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఓ వృద్ధుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వృద్ధుడు వెంకటయ్యదే అని గుర్తించారు. తాటి కమ్మలను ఒక చోట కుప్పగా పేర్చుకుని వాటికి నిప్పంటించి, అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.