హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పోరాటం ప్రజల ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ అన్నారు. ఢిల్లీలో కేంద్రం రూపొందించే విధానాలకు.. క్షేత్ర స్థాయిలోని తెలంగాణకు చెందిన రైతుకుగానీ, కర్నాటకలోని విద్యార్థికిగానీ మధ్య విపరీతమైన అగాథం ఉంటున్నదని, ఆ విధానాలు కిందిస్థాయి వారికి చేరడం లేదని పేర్కొన్నారు. ఆ మిస్సింగ్ మిడిల్ ఇప్పుడు అతిపెద్ద సవాల్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం ఐఐఎం బెంగళూరు నిర్వహించిన ‘క్లైమేట్ ఇన్నొవేషన్ సమిట్ 2026’ ప్యానెల్ డిస్కషన్లో ఆయన మాట్లాడారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్లో చాలా వరకు నగరాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలు దాటాయని గుర్తు చేశారు. వరదలు, భూకంపాల కంటే కూడా వడగాల్పుల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతున్నదని, అయినా కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పరిధిలో వడగాడ్పులను విపత్తుగా గుర్తించకపోవడం ప్రభుత్వాల వైఫల్యమన్నారు. రాబోయే విపత్తు నిర్వహణ మీటింగుల్లో దీనిపై కేంద్రాన్ని రాష్ట్రాలు ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. దేశంలోని ప్రతి కాలేజీ క్యాంపస్ను ఒక 'క్లైమేట్ గవర్నెన్స్ యూనిట్'గా మార్చాలని పిలుపునిచ్చారు.
