ముంపు ప్రాంతాలను వదలని వరద .. రాకపోకలను నిలిపేసిన అధికారులు

ముంపు ప్రాంతాలను వదలని వరద .. రాకపోకలను నిలిపేసిన అధికారులు
  • వానలతో ముంపు ప్రాంతాలు అతలాకుతలం
  • ఇంకా నీటిలోనే  రైల్వే అండర్​ పాస్​బ్రిడ్జిలు
  •  పలు కాలనీలు, బస్తీల రోడ్లపై నిలిచిన వరద 
  • పలు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్

సికింద్రాబాద్, వెలుగు: మూడ్రోజులుగా కురుస్తున్న వాన సిటీలో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వర్షం కురిసింది. నెమ్మదిగా తగ్గినా ఆకాశమంతా సాయంత్రం వరకు మేఘావృతమై ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వాన తగ్గినా చాలా ఏరియాల్లోని ముంపు ప్రాంతాలు వరదనీటిలోనే ఉన్నాయి. వర్షపు నీటితో నిండిపోయిన అండర్​పాస్​ బ్రిడ్జిలు నాలాలను తలపిస్తున్నాయి.  నేచుర్​క్యూర్​ ఆస్పత్రి, ఓయూ రైల్వేస్టేషన్, తుకారాంగేట్, ​లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతాల సమీపంలోని అండర్ పాస్ బ్రిడ్జిలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. 

దీనికి తోడు  వర్షపునీటితో పాటు నాలాల్లో చేరిన చెత్త కారణంగా డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతుండగా కాలువలను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు  వాహనదారుల రాకపోకలను నిలిపివేశారు.  బేగంపేట, మయూరి మార్గ్, బోయిన్​పల్లి ప్రాంతాల్లోని నాలాలు, రోడ్లు నీటిలోనే ఉన్నాయి. చాదర్​ఘాట్​కింది బ్రిడ్జి మీదుగా  వాహనాల రాకపోకలను  ట్రాఫిక్ పోలీసులు పునరుద్ధరించారు. వంతెన కింద నుంచి వరద ఉధృతి ఉన్నందున మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం తొలగించి  రాకపోకలను అనుమతించారు.

 వాటర్ లాగింగ్ పాయింట్ల పరిశీలన 

 వర్షాల కారణంగా జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ కమిషనర్​ రోనాల్డ్​రోస్​ పర్యటించారు. బేగంపేట మయూర్ మార్గ్, అల్లం తోట బావి, ద్వారకా దాస్  నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్ టెన్షన్, ఎస్పీ రోడ్డు పెట్రోల్​పంప్​, సికింద్రాబాద్​ ఆలుగడ్డ బావి రైల్వే బ్రిడ్జి, లాలా పేట్ సత్యానగర్​లో పర్యటించి మ్యాన్ హోల్స్, వాటర్ లాగింగ్  నాలాలను కమిషనర్​ పరిశీలించారు.  సికింద్రాబాద్ ​జోనల్​పరిధిలోని వాటర్​లాగింగ్​ పాయింట్లను చూశాక  వెంటనే వరదనీటిని తొలగించాలని  అధికారులను ఆదేశించారు. మ్యాన్ హోల్స్ వద్ద చెత్త తొలగించాలని సెట్ కాన్ఫరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్లకు ఆదేశాలు  చేశారు. వాటర్​ లాగింగ్ ​పాయింట్లు ఉన్నాయో వెంటనే గుర్తించి నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

ఓక్షిత్ ఎన్​క్లేవ్​లో అదే పరిస్థితి.. 

జీడిమెట్ల:    గాజులరామారంలోని ఓక్షిత్ ఎన్ క్లేవ్ లో బుధవారం సైతం వరద పారింది. కాలనీ పైభాగంలో ఉన్న చెరువు నుంచి వచ్చే కాల్వలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి వారం పాటు వరద నీటిలో ఉండాల్సి వస్తోందని వాపోయారు. 

వానకు కూలిన గోడ.. మహిళకు  గాయాలు

శంకర్​పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఓ ఇంటి గోడ  కూలింది. అందులో ఉంటున్న లక్ష్మి అనే మహిళకు  స్వల్ప గాయాలు కాగా..   ఆమెను స్థానికులు వెంటనే  ఆస్పత్రికి తరలించారు.