హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వర్షం దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో వరద రోడ్లపై చేరింది. రాజేంద్రనగర్లో అత్యధికంగా 5.50 సెంటిమీటర్ల వాన పడింది. అలాగే, ఆర్సీపురంలో 2.63, లింగంపల్లిలో 1.98, గచ్చిబౌలిలో 1.13 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
రెండో శనివారం హాలిడే కావడంతో షాపింగ్ తోపాటు ఇతర అవసరాలకు బయటకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నగరంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
