వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ విజిటర్ వీసాల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసిన ‘వీసా బాండ్’ కార్యక్రమాన్ని పర్మనెంట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు చెందిన 50 దేశాలు ఉన్నాయి. 30 ఆఫ్రికా దేశాలు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ సహా మొత్తం 50 దేశాల పౌరులకు ఈ రూల్ వర్తిస్తుంది.
ఈ జాబితాలో ప్రస్తుతం భారత్ లేదు. అమెరికా ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన నోటీసు ప్రకారం, ఈ కొత్త నిబంధన సోమవారం నుంచి అమల్లోకి రానుంది. వ్యాపార (బీ-1), పర్యాటక (బీ-2) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు అమెరికాకు 20 వేల డాలర్ల (సుమారు రూ.19.07 లక్షలు) వరకు వీసా బాండ్ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఏడాది పాటు నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్లో 5 వేల డాలర్లు, 10 వేల డాలర్లు, 15 వేల డాలర్లు బాండ్ల రూపంలో వసూలు చేశారు.
శాశ్వత నిబంధనలో మాత్రం 5 వేల డాలర్ల ఆప్షన్ను తొలగించి, గరిష్ట పరిమితిని 20 వేల డాలర్లకు పెంచారు. మరోవైపు, వేల డాలర్ల పూచీకత్తును డిపాజిట్ చేయాల్సి రావడం వల్ల చట్టబద్ధంగా ప్రయాణించాలనుకునే సామాన్య ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
