భారీ వర్షాలు.. సీఎస్ టెలీకాన్ఫరెన్స్

భారీ వర్షాలు.. సీఎస్ టెలీకాన్ఫరెన్స్

గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సహయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు వస్తున్నాయని దీని కారణంగా..ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు నీరు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి  జిల్లాల  కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.

అన్ని జిల్లాల్లో ఇప్పటికే రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లొ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే తెగిన రహదారులు, బ్రిడ్జిల మార్గాల్లో ప్రమాదాలు జరుగకుండా వాహనాలను, ప్రయాణీకులను నిలిపి వేయాలన్నారు. ఆయా ప్రాంతాలలో రాకపోకలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కాగా  రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం  తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.