బీఆర్ఎస్​లో ముదురుతున్న అవిశ్వాసం లొల్లి

బీఆర్ఎస్​లో ముదురుతున్న అవిశ్వాసం లొల్లి
  • బీఆర్ఎస్​లో ముదురుతున్న అవిశ్వాసం లొల్లి
  • ఇల్లందు మున్సిపల్​ వ్యవహారంపై హైకమాండ్​ ఫోకస్
  • కోర్టు కెళ్లేందుకు సిద్ధమవుతున్న అసమ్మతి కౌన్సిలర్లు
  • ప్రలోభాలపై పొలీసులకు చైర్మన్​ వర్గీయుల ఫిర్యాదు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్​లో ఇల్లందు మున్సిపల్​ అవిశ్వాసం తీర్మానం చిచ్చురేపుతోంది. మున్సిపల్​ చైర్మన్​ డి వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన అసమ్మతి కౌన్సిలర్లు క్యాంప్​ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవహారంపై మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోకస్​ పెట్టారు. అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్​ తీసుకోకపోవడంతో కోర్టుకు వెళ్లేందుకు అసమ్మతి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు కలెక్టర్​ అనుదీప్​ తీరుపై సీఎస్​కు కంప్లైంట్​ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై సంతకం పెడితే తమకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్రలోభ పెట్టారంటూ చైర్మన్​ వర్గీయులు పొలీసులకు కంప్లైంట్​ ఇవ్వడంతో బీఆర్ఎస్​లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. 

క్యాంప్ నకు అసమ్మతి కౌన్సిలర్లు..

ఇల్లందు మున్సిపాలిటీ బీఆర్ఎస్​ కౌన్సిలర్లలో నెలకొన్న విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియతో ఉన్న పలువురు కౌన్సిలర్లు ఇప్పుడు చైర్మన్​ డి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి కౌన్సిలర్లకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వర్గం తెర వెనుక మద్ధతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీఆర్ఎస్​కు19 మంది కౌన్సిలర్లున్నారు. చైర్మన్​ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ దాదాపు15 మంది కౌన్సిలర్లు సంతకం పెట్టిన అవిశ్వాసం తీర్మానం కాపీని కలెక్టర్​ అనుదీప్​కు ఇచ్చేందుకు సోమవారం కలెక్టరేట్​కు వెళ్లగా ఆయన తీసుకోలేదు. దీంతో వారు ఇన్​వార్డులో ఇచ్చారు. అవిశ్వాసం తీర్మానం కాపీని కలెక్టర్​ తీసుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై​కోర్టుకు వెళ్లేందుకు లీగల్​ అడ్వయిజర్​ సలహాలు తీసుకుంటున్నారు. ఇక అసమ్మతి కౌన్సిలర్లకు చెక్​ పెట్టేలా చైర్మన్​వర్గం పావులు కదుపుతోంది.

అవిశ్వాస తీర్మానం కాపీపై సంతకం పెడితే రూ.10 లక్షలు ఇస్తామని పలువురు కౌన్సిలర్ల ఇండ్ల వద్దకు డబ్బులు పట్టుకొని వెళ్లారనే ప్రచారం ఉంది. చైర్మన్​కు వ్యతిరేకంగా సంతకం పెడితే డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇద్దరు కౌన్సిలర్లు సోమవారం రాత్రి ఇల్లందు పొలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్​లోని ఇన్​వార్డులో కంప్లైంట్​ చేశారు. అసమ్మతి కౌన్సిలర్లతో పాటు పలువురు బీఆర్ఎస్​ నాయకులు రాజమండ్రి, వైజాగ్​ టూర్​కు వెళ్లారు. ఇదిలాఉంటే మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో  ఎమ్మెల్సీ తాతా మధు మిగిలిన కౌన్సిలర్లతో సమవేశమై అవిశ్వాసంపై చర్చించారు.

ముఖ్య నేతల నజర్​.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిసారి ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్​పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సిద్ధం కావడంతో ముఖ్య నేతలు ఈ వ్యవహారంపై ఫోకస్​ పెట్టారు. అవిశ్వాసం పెడుతున్న కౌన్సిలర్లలో ఎక్కువ మంది ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ అనుచరులే ఉన్నారు. అవిశ్వాసం విషయంలో హైకమాండ్​ సీరియస్​ కావడంతో అసమ్మతి కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో జత కట్టారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందనే విషయంపై ఆరా తీసే పనిలో పడ్డారు.