- మండు వేసవిలోనూ కాల్వల్లో సాగునీరు
- పంటల చివరి సమయం వరకు నీటి విడుదలతో రైతుల సంతోషం
మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి, మొక్క జొన్న పంటలను ఎక్కువగా సాగు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) జలాలు మహబూబాబాద్ జిల్లాకు సమృద్ధిగా చేరాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ తో పాటు, ప్రస్తుత యాసంగిలో సాగునీరు పుష్కలంగా వస్తుండటంతో రైతుల్లో ధీమా పెరిగింది. యాసంగి సీజన్లోనూ నీటి లభ్యత ఉండటంతో రైతులు వరిసాగు వైపు మొగ్గు చూపారు.
పంటల చివరి ఆయకట్టు వరకు సాగునీరు
మానుకోట జిల్లాలో ఈ యాసంగిలో 2,13,665 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేస్తున్నారు. ఇందులో 1,07,617 ఎకరాల్లో వరి పంట సాగు కాగా, మిగతా లక్ష ఎకరాల్లో మొక్క జొన్న పంటను వేశారు. పంట కాలం ముగిసి మక్కలను మార్కెట్కు తరలిస్తున్నారు. సన్నరకాలకు బోనస్ ఇవ్వడం, రైతు భరోసాలాంటి కార్యక్రమాల అమలు వల్ల రైతులు విరివిగా వరి సాగు చేశారు.
యాసంగిలో సాగునీరు పుష్కలం..
మహబూబాబాద్జిల్లాలో 1590 చెరువులు, కుంటలు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండాలి. మత్తళ్లు పోసిన చెరువుల్లో సైతం నేడు ఎస్సారెస్సీ జలాల విడుదలతో సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటల సాగు కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో హనుమకొండ, వరంగల్లు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ జలాల విడుదలతో ఎస్సారెస్పీ స్టేజీ_1, స్టేజీ_2ల పరిధిలో వారం రోజులు ఒకవైపు, మరో వారం ఇంకో వైపు నీటి విడుదల నిరంతరాయంగా కొనసాగుతుంది.
నీటికి కొరత లేదు..
సొంత భూమి రెండు ఎకరాలతోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. నీటికి కొరత లేదు. ఎస్సారెస్పీ జలాలు రావడంతో వరి పంటలకు నీరందడంతోపాటు భూగర్భ జలం పెరుగుతుంది. కాలువలు రాని సమయంలో బావుల నుంచి పంటకు నీరు పెడుతున్నాం. ఈ యాసంగిలో నీటి ఎద్దడి లేకుండా పంటల సాగుకు ఇబ్బంది ఎదురుకాలేదు. - దీకొండ కుమార్, రైతు, మాటేడు గ్రామం, తొర్రూరు మండలం
