హైకోర్టు: కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను హైకోర్టుకు నివేదించింది ప్రభుత్వం. ప్రభుత్వ తరపు అటార్ని జనరల్ (లాయర్) వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలో రేపటి నుంచి పరీక్షా కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు.
మాస్క్లు, శానిటైజర్లు అధిక ధరలకు అమ్మకుండా నిఘా పెట్టామని చెప్పగా.. అధికధరలకు మాస్క్లు, శానిటైజర్లు విక్రయిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. వైరస్ ను నియంత్రించేందుకు కేరళ చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర తరపున కొందరు వైద్య బృందం వెళ్లిందని చెప్పారు లాయర్. అయితే కేరళ చేపట్టిన చర్యల్లో అనుసరణీయమైనవి ఉన్నాయా అనే విషయాన్ని హైకోర్టుకు తెలపాలని చెప్పింది. మరిన్ని వివరాలతో ఈ నెల 23 లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.