
- ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో ఎందుకు జాప్యం జరిగిందో చెప్పాలంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. గత మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగిసిందని.. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రం, స్టేట్ ఎలక్షన్ కమిషన్లు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆదే మున్సిపాల్టీకి చెందిన సముందర్ పెల్లి రాజేందర్ వేసిన పిటిషన్ను జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి శుక్రవారం విచారించారు. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని చెప్పేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను జులై 11కి వాయిదా వేశారు. తొలుత పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వాదిస్తూ, రాష్ట్ర సర్కార్, ఎస్ఈసీ తీరు చట్టవిరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243యూ, 243జెడ్ఏన్ల ఉల్లంఘన అన్నారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019 నిబంధనలను అమలు చేయడం లేదన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదిస్తూ, వార్డుల విభజన, రిజర్వేషన్లను రాష్ట్రం ఖరారు చేసి వివరాలు అందజేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రం నుంచి వివరాలు అందాక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని చెప్పేందుకు రెండు వారాలు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణ వాయిదా పడింది.