టీఎస్​పీఎస్​సీ చైర్మన్​కు 2 వేల ఫైన్

టీఎస్​పీఎస్​సీ చైర్మన్​కు 2 వేల ఫైన్
  • పీఈటీ పోస్టుల భర్తీ కేసులో హైకోర్టు సీరియస్

High court fined Tspsc chairmanహైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ చైర్మన్‌‌ ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణి ప్రసాద్‌‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పీఈటీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని నిర్ధారిస్తూ, ఇద్దరికీ రూ.2 వేల చొప్పున ఫైన్​ విధించింది. ఈ మొత్తాన్ని 6 నెలల్లోగా చెల్లించకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ వ్యవహారాన్ని సర్వీస్‌‌ కమిషన్‌‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌‌ సర్వీస్‌‌ రికార్డుల్లో నమోదు చేయాలని, శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2017లో సర్వీస్‌‌ కమిషన్‌‌ పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్​ రూల్స్​కు విరుద్ధమని, పీఈటీ పోస్టుల భర్తీని అడ్డుకోవాలని కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. పిటిషన్​ విచారించిన హైకోర్టు.. నోటిఫికేషన్​ను నిలిపేస్తూ గతేడాది మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. అయినప్పటికీ సర్వీస్​కమిషన్ ​పీఈటీ ఫలితాలను వెలువరించడంతో అభ్యర్థులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కారం కింద దాఖలైన పిటిషన్​ను విచారించిన హైకోర్టు.. కమిషన్​ తీరును తప్పుబట్టింది. టీఎస్​పీఎస్ సీ చైర్మన్​ ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణిప్రసాద్​ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టారని తేల్చింది.