
- పీఈటీ పోస్టుల భర్తీ కేసులో హైకోర్టు సీరియస్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణి ప్రసాద్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పీఈటీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని నిర్ధారిస్తూ, ఇద్దరికీ రూ.2 వేల చొప్పున ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని 6 నెలల్లోగా చెల్లించకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ వ్యవహారాన్ని సర్వీస్ కమిషన్ సెక్రటరీ వాణి ప్రసాద్ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని, శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2017లో సర్వీస్ కమిషన్ పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ రూల్స్కు విరుద్ధమని, పీఈటీ పోస్టుల భర్తీని అడ్డుకోవాలని కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. పిటిషన్ విచారించిన హైకోర్టు.. నోటిఫికేషన్ను నిలిపేస్తూ గతేడాది మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. అయినప్పటికీ సర్వీస్కమిషన్ పీఈటీ ఫలితాలను వెలువరించడంతో అభ్యర్థులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కారం కింద దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు.. కమిషన్ తీరును తప్పుబట్టింది. టీఎస్పీఎస్ సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణిప్రసాద్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టారని తేల్చింది.