ఎమ్మెల్యేల కేసు: సిట్ దర్యాప్తు సక్రమంగా లేదన్న పిటిషనర్లు

ఎమ్మెల్యేల కేసు:  సిట్ దర్యాప్తు సక్రమంగా లేదన్న పిటిషనర్లు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎవిడెన్స్ను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. సీఎం ఇచ్చిన ఎవిడెన్స్ను చూసి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌస్ కేసు వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైప్రొఫైల్ కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎలా బయటికి వెళ్ళాయని అడిగారు.  సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. 

ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్ తరుపున న్యాయవాది వాదించారు. సెక్షన్ 17(b) ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే 2003లో ఏసీపీ పరిధిని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని...దాని ప్రకారం 2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీనే విచారించాలని పిటిషనర్ వాదించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని రేపు తుది వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.