స్మితా సబర్వాల్కు ప్రభుత్వ నిధులపై హైకోర్టు విస్మయం

స్మితా సబర్వాల్కు ప్రభుత్వ నిధులపై హైకోర్టు విస్మయం

పరువు నష్టం దావా వేసేందుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం నిధులు సమకూర్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రూ.15 లక్షలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 2015లో ఔట్ లుక్ మేగజైన్పై పరువునష్టం దావా వేసిన స్మిత సబర్వాల్కు అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కాదన్న హైకోర్టు..90 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం అసమంజసంగా ఉందని ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.

2015లో తన ఫొటోను అవమానకరంగా ప్రచురించారంటూ స్మిత సబర్వాల్ ఔట్ లుక్ మేగజైన్ పై పరువు నష్టం దావా వేశారు. కోర్టు ఫీజుల కోసం ఆమెకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో నిధులపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.