స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టేందుకు హైకోర్టు అనుమతి

స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టేందుకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ సీటుకు 2018లో జరిగిన ఎన్నికలకు చెందిన డాక్యుమెంట్స్, ఈవీఎంలను భద్రపరిచిన నూకపల్లిలోని బీఆర్‌కే కాలేజీలోని స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టేందుకు హైకోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు అనుమతినిచ్చింది. అదే సమయంలో కార్పెంటర్, తాళాలు తీసే నిపుణుల సాయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అన్ని పార్టీల లీడర్ల సమక్షంలో ఈ పని చేయాలని హైకోర్టు జస్టిస్‌  కె.లక్ష్మణ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాళాలు తీసిన తర్వాత స్ట్రాంగ్‌ రూంలోని ఫైళ్లు, ఈవీఎంలు తరలించేందుకు రిటర్నింగ్‌ అధికారి అడిగిన వాహనాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతను కల్పించాలని సూచించారు. అంతకుముందు స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు కనిపిండం లేదని కలెక్టర్‌ కోర్టుకు నివేదిక ఇచ్చారు.

ఈసీ తరఫు లాయర్‌ దేశాయ్‌ అవినాశ్‌ వాదిస్తూ, ఘటనపై ముగ్గురు ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేశామని, ఈ నెల 26న రిపోర్టు వచ్చాక హైకోర్టుకు సమర్పిస్తామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్‌ తెరిచి ఎన్నికకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కలెక్టర్ మధ్యంతర పిటిషన్ ​దాఖలు చేయగా,  కలెక్టర్‌ కావాలనే తాళాలను తప్పుగా వినియోగించారని, అందుకే అవి సరిపోలేదని పిటిషనర్‌ అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ లాయర్‌  ధర్మేశ్‌ డీకె జైశ్వాల్‌ వాదించారు. కోర్టు తాళాలు తెరవమన్న రోజే తాళాలు చేసే వ్యక్తి, వడ్రంగిని కూడా తీసుకురావడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కలెక్టర్‌ పిటిషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదన్నారు. కొప్పుల ఈశ్వర్‌ తరఫున హనుమంతరావు వాదించారు. తదుపరి విచారణను 24కు వాయిదా వేశారు.